Begin typing your search above and press return to search.

శశికళ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు

By:  Tupaki Desk   |   24 Dec 2016 3:07 PM IST
శశికళ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు
X
తమిళనాడు రాజకీయాల్లో రెండు రోజులుగా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్కడంతా నిశ్శబ్ద రాజకీయం నడుస్తోంది... పైకి ఏమీ కనపడకుండా అంతా తెర వెనుక వ్యూహరచనలు, వాటి అమలు చురుగ్గా సాగుతోందని తెలుస్తోంది. జయలలిత అంత్యక్రియల అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలు అన్నా డీఎంకే పార్టీ ప్రతిష్ఠకు నష్టం చేకూర్చేలా ఉండడంతో పాటు - వ్యక్తిగత సమస్యలు తెచ్చేలా తయారు కావడంతో ఆ పార్టీ నేతలు శశికళకు పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకు ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 29వ తేదీన అన్నాడీఎంకే కార్యవర్గ - సర్వసభ్య సమావేశాలు నిర్వహించి... ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగించాలని పార్టీ నిర్ణయించింది. తొలుత పార్టీ పగ్గాలు అందుకున్న తరువాత సీఎం కుర్చీని చేరుకోవాలన్నది శశికళ వ్యూహంగా తెలుస్తోంది.

ఈ నెల 29వ తేదీన ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాలకు సర్వసభ్య కార్యవర్గంలోని 2,770 మంది సభ్యులంతా తప్పనిసరిగా దీనికి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అదే రోజు చిన్నమ్మను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడంతో పాటు, ఇతర కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు.

మరోవైపు కార్యవర్గంలో మొత్తం చిన్నమ్మ అనుచరులే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాల్లో పట్టు పెంచుకుని ముఖ్యమంత్రి కుర్చీ అందుకోవాలన్నది శశికళ ప్లానుగా తెలుస్తోంది. మరి .. పన్నీర్ సెల్వం ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/