Begin typing your search above and press return to search.

అనుమానాస్పద మృతి కాదు.. ఆత్మహత్య

By:  Tupaki Desk   |   8 Nov 2015 4:32 AM GMT
అనుమానాస్పద మృతి కాదు.. ఆత్మహత్య
X
మాజీ ఎంపీ రాజయ్య కోడలు.. ముగ్గురు మనమల దారుణ మృతికి సంబంధించి కోర్టుకు వరంగల్ పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. సారికది ఆత్మహత్యగా తాము భావిస్తున్నామని.. మామ రాజయ్య.. అత్త మాధవి.. భర్త అనిల్.. రెండో భార్య సన వేధింపులతో జీవితం మీద విరక్తి చెందిన సారిక ఈ దారుణానికి పాల్పడి ఉంటుందన్న అభిప్రాయాన్ని పోలీసులు పేర్కొన్నారు. ఇంట్లోని వారి వేధింపులకు తాళలేక.. సారిక తన బెడ్ రూమ్ లో గ్యాస్ సిలిండర్లు.. పిల్లల్ని తీసుకెళ్లి.. లోపల నుంచి గడియ పెట్టుకొని ఈ దారుణానికి పాల్పడినట్లుగా వెల్లడించారు.

తొలుత ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పోలీసులు తాజా రిమాండ్ నోట్ లో అనుమానాస్పద మృతి కింద పెట్టిన సెక్షన్ ను తొలగించారు. మిగిలిన నేరారోపణలు మాత్రమే అలానే ఉంచేశారు. పోలీసుల రిమాండ్ నోట్ లో ఐపీసీ సెక్షన్ల కింద నమోదు చేసిన అంశాల్ని చూస్తే.. వరకట్న వేధింపులు (498ఏ).. ఆత్మహత్యకు ప్రేరేపించటం (306)లను మాత్రమే ఉంచారు. అనుమానస్పద మృతి కింద నమోదు చేసిన సెక్షన్ 174ను తొలగించారు.

రిమాండ్ నోట్ తయారీ ముందు.. సారిక తల్లిదండ్రులు.. రాజయ్య కుటుంబ సభ్యులు.. వారి ఇరుగుపొరుగువారితో పాటు.. రాజయ్య కారు డ్రైవర్లు.. తదితరులతో మొత్తం 24 మంది సాక్ష్యుల నుంచి సాక్ష్యాల్ని సేకరించి రిమాండ్ నోట్ ను తయారు చేశారు. మరోవైపు.. మాజీ ఎంపీ రాజయ్య బెయిల్ కోసం పిటీషన్ ను కోర్టులో దాఖలు చేశారు. సారికను.. రాజయ్య కుటుంబ సభ్యులు విపరీతమైన వేధింపులకు గురి చేయటం వల్ల ఆమె మానసికంగా కుంగిపోయి ఈ దారుణానికి పాల్పడి ఉంటుందన్న మాటను పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.