Begin typing your search above and press return to search.

ఏమవుద్ది?; ఇంతకీ సండ్ర ఎక్కడున్నారు..?

By:  Tupaki Desk   |   28 Jun 2015 9:59 AM IST
ఏమవుద్ది?; ఇంతకీ సండ్ర ఎక్కడున్నారు..?
X
ఓటుకు నోటు కేసులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ నోటీసులు ఇవ్వాలని ప్రయత్నించటం.. ఆ సమయంలో ఆయన అందుబాటులో లేకపోవటం.. ఆ తర్వాత ఆయన కనిపించకుండా పోవటం తెలిసిందే.

ఈ కేసు విచారణ కోసం తమ వద్దకు రావాలంటూ గడువు విధించిన నేపథ్యంలో.. తాను అనారోగ్యానికి గురి అయ్యానని.. పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని.. ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు తనకు పది రోజుల గడువు కావాలని కోరుతూ తన సహాయకుల చేత ఒక లేఖ పంపిన విషయం తెలిసిందే.

అయితే.. ఆయన ఎక్కడున్నారు? ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్న అంశంపై ఊహాగానాలు తప్పించి.. అధికారికంగా ఎక్కడ ఉన్నారన్న విషయంపై స్పష్టత రాని పరిస్థితి. తాజాగా.. సండ్ర కోరుకున్న పది రోజులకు ఆదివారం నాటితో తొమ్మిది రోజులు గడిచిపోయాయి. మరి.. ఏసీబీకి పంపిన లేఖలో పేర్కొన్న విధంగా పదో రోజున ఏసీబీ విచారణకు హాజరు అవుతారా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది.

అసలు ఇంతకీ సండ్ర ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయంపై ఎలాంటి సమాచారం లేని పరిస్థితి. తనకు తాను చెప్పుకున్న గడువు పూర్తి అవుతున్న నేపథ్యంలో ఆయన విచారణ కోసం ఏసీబీ అధికారుల వద్దకు వస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ.. ఆయన కానీ రాకుంటే ఏసీబీ అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠ చోటు చేసుకుంది.