Begin typing your search above and press return to search.

'హీరో'కు ఇసుక రీచ్‌

By:  Tupaki Desk   |   5 Feb 2016 7:18 AM GMT
హీరోకు ఇసుక రీచ్‌
X
ఆటోమొబైల్ రంగంలో దేశంలోనే అతిపెద్ద కంపెనీగా పేరు గాంచిన సంస్థ హీరో.. తన ద్విచక్రవాహనాల విక్రయంతో దేశ ప్రజల మనసు దోచుకున్న సంస్థ అది. ఏం మాయ చేసిందో ఏమో కానీ ప్రజలే కాదు ప్రభుత్వాధికారులూ ఈ 'హీరో' పట్ల అభిమానం చూపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ఈ సంస్థ త్వరలో నిర్మించనున్న భవనానికి ప్రభుత్వాధికారులు ఏకంగా ఒక ఇసుక రీచ్‌ నే కేటాయించడం ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది.

గతంలోనూ హీరో కంపెనీకి అతి తక్కువ ధరకే భూములు అప్పగించారు. ఇప్పుడు టెండర్లు లేకుండానే ఇసుక రీచ్‌ ను కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. క్యూబిక్‌ మీటర్‌ కు 55 రూపాయలు చొప్పున నామమాత్రపు రుసుము చెల్లించి ఎంతైనా తవ్వకునేందుకు అనుమతులివ్వనుంది. చిత్తూరు జిల్లాలోని బిఎన్‌ కండ్రిగ మండలంలో ఆలత్తూరు గ్రామ సమీపంలో ఉన్న రీచ్‌ ను 'హీరో' నిర్మాణాలకు ఇచ్చేందుకు గుర్తించారు. గతంలో ఇదే ప్రాంతంలో ఇసుకను తవ్వుకునేందుకు మహిళా సంఘాలకు క్యూబిక్‌ మీటర్‌ ను 500 రూపాయలకు అధికారులు అప్పజెప్పారు. ఇప్పుడు హీరో కంపెనీకి అత్యంత కారుచౌకగా 55 రూపాయలకే ఒక క్యూబిక్‌ మీటర్‌ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే ఒక ట్రాక్టర్‌ ఇసుక కేవలం 150 రూపాయలు మాత్రమే. ఇదే ఇసుక బయట సామాన్యుడు కొనుగోలు చేయాలంటే 2,500 నుంచి 3,000 ఖర్చు చేస్తే తప్ప దొరికే పరిస్థితి లేదు. జిల్లాలోని సత్యవేడులోని చెరివి పంచాయతీలో మాదనపాలం వద్ద కంపెనీ నిర్మాణానికి 633 ఎకరాలను సర్కార్‌ కేటాయించింది. ఎకరాకు 1.60 లక్షల రూపాయలే ముట్టజెప్పింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాంపౌండ్‌ వాల్‌ వంటి నిర్మాణాలు చేపడుతోంది. ఏకంగా ఇసుక రీచ్ నే ఆ సంస్థకు అప్పగిస్తే స్థానికంగా మిగతావారికి ఇసుక కొరత ఏర్పడుతుందని విమర్శలు వస్తున్నాయి.