Begin typing your search above and press return to search.

ఈసారి తిరుమల నుంచి తాడేపల్లికి సాములోరి పాదయాత్ర

By:  Tupaki Desk   |   26 Dec 2021 2:30 AM GMT
ఈసారి తిరుమల నుంచి తాడేపల్లికి సాములోరి పాదయాత్ర
X
కామ్ గా ఉన్నట్లు కనిపిస్తూ.. అకస్మాత్తుగా ఏదో ఒక అంశాన్ని టేకప్ చేసి సంచలనంగా మారటం.. వార్తల్లో వ్యక్తిగా మారటం శీ పీఠం వ్యవస్థాపకుడు ఆథ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణనంద తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమకు.. ఏపీ ప్రభుత్వానికి మధ్య సినిమా టికెట్ల లొల్లి నడుస్తున్నసంగతి తెలిసిందే. ఇలాంటి వేళ పరిపూర్ణానంద స్వామి విలేకరులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో సినిమా టికెట్ల ధరల్ని తగ్గించిన ప్రభుత్వం తిరుమలలో మాత్రం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటూ బ్లాక్ లో మూడు వేల టికెట్లను అమ్ముతున్నారంటూ ఆరోపించారు. మరోవైపు స్వామి వారి ఆర్జిత సేవల ధరల్ని సైతం మార్చనున్నట్లు ప్రకటించారు. మరి.. సినిమా టికెట్ల ధరల్ని తగ్గించి.. ఏపీ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నట్లు చెబుతున్న వేళ.. తిరుమల స్వామివారి దర్శనానికి విడుదల చేసే ఆర్జిత సేవల ధరల్ని త్వరలో పెంచుతామంటున్నారు. సినిమా టికెట్ల ధరల్ని తగ్గించినప్పుడు.. దేవుడి ఆర్జిత సేవల్ని ఎలా పెంచుతారన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు.

ఈ లొల్లి ఒక కొలిక్కి రాక ముందే.. మరో విమర్శ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టింది. ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయని.. ఇలాంటి వేళలో రాష్ట్రంలో క్రిస్మస్.. కొత్త సంవత్సరం వేడుకల్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది కదా? అని ప్రశ్నస్తున్నారు. డెల్టా వైరస్ పెద్ద ఎత్తున వ్యాపించిన వేళ.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రభుత్వం నియంత్రణలకు పెద్ద పీట వేయాల్సిన అవసం ఉందంటున్నారు. గతంలో డెల్టా పేరు చెప్పి ... హిందూ పండుగల్ని వాయిదా వేశారని.. ఇప్పుడు అలాంటి పనే సీఎం జగన్ ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు.

హిందువులు దేవాలయానికి వెళ్లొద్దని.. హిందువులు ఊరేగింపులు.. పూజలు చేసుకోవద్దంటూ కేవలం హిందువుల పండుగలకే ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందని.. మిగిలిన వారికి కరోనా సోకదనే అభిప్రాయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్లుగా ఉందని ఆయన విమర్శించారు. గత ఎన్నికల్లో జగన్ కు ఓటేసిన వారిలో 90 శాతం మంది హిందువులే ఉన్నారని.. వారి మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగన్ దేనని చెప్పారు.

ఏపీలో గుర్తు తెలియని వారి కారణంగా దెబ్బ తిన్న దేవాలయాల్ని తిరిగి నిర్మించకపోతే తాను తిరుమల నుంచి తాడేపల్లి వరకు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఈ మధ్యనే న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి రైతులు నిర్వహించిన పాదయాత్రకు ఎన్నెన్ని తిప్పలు ఎదురయ్యాయో తెలిసి కూడా సాములోరు పాదయాత్రకు సిద్ధమవుతున్నారా? ఏమైనా.. సినిమా టికెట్ల ధరలు తగ్గించి.. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల ధరల్ని పెంచటం మీద సాములోరి క్వశ్చన్ సూటిగా తగిలేలా ఉందంటున్నారు.