Begin typing your search above and press return to search.

యూపీలో దారుణం : దారుణహత్యకి గురైన ఎస్పీ నేత, అతని కొడుకు !

By:  Tupaki Desk   |   20 May 2020 5:45 AM GMT
యూపీలో దారుణం : దారుణహత్యకి గురైన ఎస్పీ నేత, అతని కొడుకు !
X
ఉత్తరప్రదేశ్‌ లో సమాజ్‌వాది పార్టీ నాయకుడు, అతని కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. సంభాల్‌ జిల్లాలోని బహ్ ‌జోయ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనుల విషయంలో మొదలైన గొడవ హత్యకు దారితీసింది అని తెలుస్తుంది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. ఉత్తరప్రదేశ్‌, సంభాల్‌ జిల్లా సరోయ్‌ గ్రామానికి చెందిన చోటేలాల్‌ దివాకర్‌ తన కొడుకుతో కలిసి ఇవాళ ఉదయం గ్రామ శివార్లోని పొలాల దగ్గర మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని చూసేందుకు వెళ్లారు. అయితే ఈ సమయంలో అక్కడే పొలం వద్ద వీరికి, అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరికి మధ్య గొడవ జరిగింది. తమ పొలం మధ్యగా ఇలా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడాన్ని తాము సహించబోమని వారి వద్ద ఉన్న తుపాకీతో ఆ ఇద్దరిలో ఒకడైన సవీందర్ అనే వ్యక్తి హెచ్చరించినా.. చోటే లాల్ దివాకర్, ఆతని కొడుకు అతనితో ఘర్షణ పడ్డారు.

ఆ గొడవ తీవ్ర ఉగ్రరూపం దాల్చడంతో సవీందర్, అతని సహచరుడు...ఎస్పీ నాయకుడు దివాకర్,అతని కొడుకుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చోటేలాల్ దివాకర్, సునీల్ ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఆ తరువాత ఆ దుండగులు అక్కడి నుండి పారిపోయారు. చోటేలాల్‌ దివాకర్‌ 2017లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేసి ఓడి పోయాడు. ఆ తర్వాత సరోయ్‌ గ్రామ ప్రధాన్‌ గా ఎన్నికయ్యాడు చోటేలాల్ దివాకర్ భార్య ప్రస్తుత షంసోయ్ గ్రామ ప్రధాన్ గా ఉన్నారు.