Begin typing your search above and press return to search.

చనిపోయిన వారికీ జీతాలు!... గొప్ప పని చేశారుగా...?

By:  Tupaki Desk   |   2 Feb 2022 10:30 AM GMT
చనిపోయిన వారికీ జీతాలు!... గొప్ప పని చేశారుగా...?
X
అదేంటో పంతం ముందు మరేమీ కనిపించవు. ఆదరాబాదరగా డెసిషన్స్ తీసుకోవడం, తమ మాటే నెగ్గాలని చూడడం వల్లనే ఏపీలో ప్రభుత్వం ఇపుడు అభాసు పాలు అవుతోంది. ఫస్ట్ డేట్ కల్లా కొత్త పీయార్సీ మేరకు ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని సర్కార్ అతి పెద్ద కంకణం కట్టుకుంది. ఆ విధంగా కొత్త పే స్లిప్స్ తో జీతాలు పెరిగాయని చూపించాలని ఏలిన వారి తాపత్రయం.

అయితే హోల్ మొత్తంగా జీతాలు పెరగడం కాదు, తమకు ఏఏ అంశాల్లో ఎంత మొత్తాలు తగ్గింది అన్నది సగటు ఉద్యోగి ఇట్టే గ్రహిస్తాడు. ఆ విషయంలో ప్రభుత్వం ఆరాటం అంతా ఒక వృధా ప్రయాసే అని ఇప్పటికే తేలిపోయింది. ఇదిలా ఉండగా ఫస్ట్ కి కొత్త జీతాలు ఇచ్చి తీరాల్సిందే అని పట్టుబట్టి ప్రభుత్వం చూపించిన అతి తొందర వల్ల చాలా రకాలైన తప్పులు దొర్లిపోయాయని అంటున్నారు.

ఇలా ఫస్ట్ కి జీతాలు అంటూ చనిపోయిన వారికి కూడా జీతాలు వేసేశారుట. అలాగే రిటైర్ అయిన వారికీ పెన్షన్లు ఇవ్వాలి కానీ భారీగా జీతాలు పడిపోయాయట. దీంతో సర్కార్ తొందరపాటు తనం ఇపుడు నవ్వులపాలు అవుతోంది. పోనీ వ్రతం చెడినా ఫలితం దక్కిందా అంటే ఈ జీతాల లెక్కలు మా కంటే ఎవరికి బాగా తెలుస్తాయని ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు.

ఈ పరిణామంతో ప్రభుత్వం మరింతగా చిన్నబోవాల్సి వచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. మీరు చేసిన తప్పులు పొరపాట్ల కారణంగా మృతి చెందిన వారికే కాదు, ఆఖరుకు సస్పెండ్ అయిన వారి ఖాతాల్లో కూడా జీతాలు జమ చేసి పుణ్యం కట్టుకున్నారు అని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఈ తప్పుల మీద మేము క్రిమినల్ కేసులు పెడితే సర్కార్ నుంచి జవాబు ఉంటుందా అని కూడా వారు అంటున్నారు.

ఇదంతా పంతం కోసమే ప్రభుత్వం చేసిందని, బాధ్యత కలిగిన అన్నీ తెలిసిన ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పే స్లిప్స్ ప్రక్రియను చేయించాల్సింది ప్రైవేట్ ఏజెన్సీలను రప్పించి చేస్తే ఇలాగే ఉంటుందని కూడా ఎకసెక్కమాడుతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. మరో వైపు చూస్తే మొత్తానికి మాకు జీతాలు చెల్లించి మంచి పనే చేశారు. మేము సుదీర్ఘమైన సమ్మెకు సిద్ధమవుతున్నాం, మాకు కావాల్సిన ధనాన్ని ఇంధనాన్ని సమకూర్చి భేషైన పని చేశారు అని ఉద్యోగ సంఘాలు సెటైకల్ గా సర్కార్ వైఖరిని తూర్పారా పట్టడమే ఇక్కడ బిగ్ ట్విస్ట్.

మొత్తానికి కొత్త పే స్లిప్స్ తో జీతం పెరిగింది అని సంబరపడుతూ ఉద్యోగులు సమ్మె విరమించి దారికి వస్తారనుకుంటే అంతకు మించి వారు సౌండ్ చేస్తున్నారు. అంతే కాదు పే స్లిప్స్ ని దహనం చేస్తున్నారు. మొత్తానికి సర్కార్ ఇలా చనిపోయిన వారికి సస్పెండ్ అయిన వారికీ జీతాలు ఇచ్చేసి పరువు తీసుకుందా అన్నదే చర్చగా ఉందిట. చూడాలి మరి ప్రభుత్వం ఇపుడు ఎలా రియాక్ట్ అవుతుందో.