Begin typing your search above and press return to search.

మ‌సీదును కూల్చండి..విగ్ర‌హాలు లేకుంటే న‌న్ను ఉరితీయండి

By:  Tupaki Desk   |   24 Nov 2018 10:06 AM GMT
మ‌సీదును కూల్చండి..విగ్ర‌హాలు లేకుంటే న‌న్ను ఉరితీయండి
X
మ‌త‌ రాజ‌కీయాల్లో భాగంగా మ‌రోమారు వివాదాస్పద అంశాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా అయోధ్యలో రామ‌మందిరం కేంద్రంగా నాయ‌కులు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా తాజాగా ముస్లింల మ‌సీదులు సైతం తెర‌మీద‌కు వ‌చ్చాయి. బీజేపీ నేత‌ - వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు సుప‌రిచితుడు అయిన ఎంపీ సాక్షి మహరాజ్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని జామా మసీదును కూల్చేయాలని పిలుపునిచ్చారు. ఉన్నావ్‌ లో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన సాక్షి మహారాజ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను చేసిన తొలి ప్రకటన గురించి చెప్పాన‌ని అంటూ మ‌రోమారు అదే త‌ర‌హా కామెంట్లు చేశారు.

మొఘల్ పాలకులు హిందువుల మనోభావాలతో ఆడుకున్నారని - ఆలయాలను ధ్వంసం చేసి వాటి స్థానంలో మసీదులను నిర్మించారని సాక్షిమ‌హారాజ్ ఆరోపించారు. ``నేను రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు ఒక ప్రకటన చేశా. ఢిల్లీలోని జామా మసీదును కూల్చేస్తే అందులో దేవుడి విగ్రహాలు దొరుకుతాయి. ఒకవేళ విగ్రహాలు దొరకకపోతే నన్ను ఉరితీయండి అని చెప్పా. ఇప్పటికీ ఆ ప్రకటనకు కట్టుబడి ఉన్నా`` అని తేల్చిచెప్పారు. అయోధ్యలో ఓ ఆలయం ఉండేదని అమిత్ షా జైపూర్‌ లో చెప్పారని గుర్తుచేసిన సాక్షి మహారాజ్...అక్కడే ఒక మహాద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తామని అమిత్‌ షా ఇచ్చిన మాటకు ఇచ్చిన మాటకు బీజేపీ కట్టుబడి ఉంటుందన్నారు.

ఇదిలాఉండ‌గా - అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి మార్గం సుగమం కావాలంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని శివసేన మరోసారి డిమాండ్ చేసింది. వెంటనే ఆర్డినెన్స్‌ ను తీసుకురండి. ఆలయ నిర్మాణ తేదీని ప్రకటించండి అని కోరింది. ఆ పార్టీ నాయకుడు - ఎంపీ సంజయ్‌ రౌత్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ``అయోధ్యలోని బాబ్రీ మసీదును 17 నిమిషాల్లో కూల్చేశాం. కానీ రామ మందిరం నిర్మాణానికి చట్టం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎంత సమయం కావాలి? ప్రభుత్వం తలుచుకుంటే చిటికెలో ఆర్డినెన్స్‌ ను తీసుకురావచ్చు. ఢిల్లీ నుంచి ఉత్తర్‌ ప్రదేశ్ వరకు బీజేపీకి అడ్డు లేదు కదా. మరి ఎందుకు ఆర్డినెన్స్‌ ను తీసుకురావడం లేదు? అని ప్రశ్నించారు. రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేదు కదా అని విలేకరులు ప్రశ్నించగా.. రామ మందిరం నిర్మాణ బిల్లు రాజ్యసభలోకి వస్తే సభ్యులు వారి పార్టీల నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరిస్తారు. ఎవరైనా ఈ బిల్లును వ్యతిరేకిస్తే దేశంలో ఎలా తిరుగుతారో చూస్తాం అని పేర్కొన్నారు.