Begin typing your search above and press return to search.

సాక్షి ప్రసారాలు మధ్యలో ఆగిపోయాయి ఎందుకు?

By:  Tupaki Desk   |   10 Jun 2016 10:38 AM IST
సాక్షి ప్రసారాలు మధ్యలో ఆగిపోయాయి ఎందుకు?
X
ఏపీ సర్కారు అనుసరించిన విధానం ఇప్పుడు వివాదంగా మారింది. కాపు నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్ష నేపథ్యంలో.. ఆయన ఇంటి తలుపుల్ని బద్ధలు కొట్టి ముద్రగడను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ వ్యవహారాన్ని టెలికాస్ట్ చేస్తున్న ఏపీ విపక్ష నేత జగన్ కు చెందిన సాక్షి టీవీ ప్రసారాల్ని ప్రభుత్వం నిలిపివేయటం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

ఎంఎస్ వోలపై ఒత్తిడి తీసుకొచ్చిన ప్రభుత్వం.. ముద్రగడ అరెస్ట్ వ్యవహారాల్ని ప్రసారం చేస్తున్న సాక్షి ప్రసారాల్ని అడ్డుకోవటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముద్రగడ దీక్ష నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని మీడియాపై పలు ఆంక్షలు పెట్టిన పోలీసులు తాజాగా సాక్షి టీవీ కార్యక్రమాల్ని అడ్డుకోవటం.. ప్రసారాల్ని నిలిపివేయటాన్ని జర్నలిస్ట్ సంఘాలు తప్పుపడుతున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా ఏపీ సర్కారు వ్యవహరిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

దీనిపై ఏపీ అధికారపక్ష నేతలు వాదన మరోలా ఉంది. ముద్రగడ పద్మనాభం అరెస్ట్ వ్యవహారం సున్నితమైనదని.. సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టే అంశమని.. ఏపీ సర్కారును ఇబ్బంది పెట్టేందుకే జగన్ మీడియా సంస్థ అత్యుత్సాహంతో వ్యవహరిస్తుందని.. అందుకే తాము బ్రేకులు వేసినట్లుగా లోగుట్టుగా చెబుతున్నారు. చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు నిర్వహిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అలాంటిదేమీ లేకుండానే టీవీ ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయటం మంచి పరిణామం కాదన్న మాట బలంగా వినిపిస్తోంది.