Begin typing your search above and press return to search.

నియంతకు సమాధిలో కూడా ప్రశాంతత లేదు!

By:  Tupaki Desk   |   17 March 2015 10:05 AM IST
నియంతకు సమాధిలో కూడా ప్రశాంతత లేదు!
X
ఇరాక్‌లో మారణహోమం సృష్టిస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులను అణిచి వేయడానికి అక్కడి ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో అటు ఐఎస్‌ నుంచి కూడా తీవ్రమైన ప్రతిఘటనే ఎదురవుతోంది. ఆయుధసంపత్తి కలిగిన ఐఎస్‌ ఎదురుదాడి చేస్తోంది.

ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఆ ఎదురుదాడుల్లో ఇరాక్‌ ఒకనాటి నియంత సద్దాం హుస్సేన్‌ సమాధి ధ్వంసం కావడం. మరోవైపు ఆ సమాధిలో సద్దాం శవం ఉందా లేదా? అనేది కూడా ఇప్పుడు మిస్టరీగా మారింది. ఐఎస్‌, ఇరాకీ సైన్యానికి మధ్యజరుగుతున్నయుద్ధంలో సద్దాం సమాధి పూర్తిగా శిథిలం అయ్యింది. బుల్లెట్ల బాంబు దాడులతో మొత్తం నిర్మాణం కూలిపోయింది.

మరి శిథిలమైన సమాధిలో సద్దాం శవం పరిస్థితి ఏమిటి? అనేది ఆయన అభిమానుల్లో ఆందోళన రేపుతున్న అంశం. ఈ నేపథ్యంలో స్థానిక మీడియాలో సద్దాం శవం గురించి కొత్త కథనాలు వస్తున్నాయి. ఏడాది కిందటే సద్దాం అనుచరులు కొందరు ఆయన శవాన్ని అక్కడి నుంచి తవ్వి తీసుకెళ్లారనేది ఆ కథనాల సారాంశం. సద్దాంను దైవంగా ఆరాధించే వాళ్లు ఐఎస్‌ ఉగ్రవాదం తీవ్రరూపం దాలుస్తున్న సమయంలోనే.. నియంత సొంతూరు అయిన త్రికిత్‌ నుంచి శవాన్ని తీసుకెళ్లారని.. ఎముకలు మాత్రమే మిగిన ఆయన ఉనికిని మరో చోట భద్రంగా దాచుకొన్నారని తెలుస్తోంది.

దాదాపు పది, పన్నెండేళ్ల కిందట ఇరాక్‌లో సద్దాం శకం అంతమైంది. అమెరికా సద్దాం సామ్రాజ్యాన్ని కూలదోసింది. ఆ తర్వాత అతడిని పట్టి ఉరితీశారు. శవాన్ని అనుచరులు తీసుకెళ్లి త్రికిత్‌లో సమాధి చేశారు. తన కనుసైగలతో ఇరాక్‌ను పాలించిన సద్దాంకు ఇప్పుడు సమాధిలో కూడా ప్రశాంతత లేకుండా పోయినట్టుంది!