Begin typing your search above and press return to search.

కమలం గూటికి కాంగ్రెస్ యువ నేత?

By:  Tupaki Desk   |   9 Aug 2021 5:30 PM GMT
కమలం గూటికి కాంగ్రెస్ యువ నేత?
X
కాంగ్రెస్ నుంచి మరో కీలక వికెట్ బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమైందా? కాంగ్రెస్ యువ నేత, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. భవిష్యత్తులో ఆయన తమ పార్టీలో చేరవచ్చంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, రాజస్థాన్ బీజేపీ చీఫ్ ఏపీ అబ్దుల్ కుట్టి తాజాగా సంకేతాలిచ్చారు.

సచిన్ పైలట్ మంచి నేత.. రాజస్థాన్ కాంగ్రెస్ భవిష్యత్తు నేత, భవిష్యత్ సీఎం.. భవిష్యత్తులో ఆయన బీజేపీలో చేరుతారని తాను అనుకుంటున్నానని అబ్దుల్ తాజాగా సంకేతాలిచ్చారు. సచిన్ పైలట్ మంచి నేత అని.. భవిష్యత్తులో ఆయన బీజేపీలో చేరుతారని తాను అనుకుంటున్నానని చెప్పారు.

గత ఏడాది పైలట్, ఆయనకు విధేయులైన 18మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై తిరుగుబాటు చేయడంతో పైలట్ బీజేపీలోకి వస్తారనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఆ ఊహాగానాలను పైలట్ తోసిపుచ్చారు. అలాంటి ఆలోచన లేదని వివరణ ఇచ్చారు.

గతంలోనే సచిన్ పైలట్ కాంగ్రెస్ లో అసమ్మతి రాజేసారు. రాజస్థాన్ కాంగ్రెస్ సర్కార్ ను కూల్చేలా ప్రయత్నించారు. సచిన్ పైలెట్ ను రప్పించి మెప్పించి కాంగ్రెస్ లోనే ఉండేటట్టు చేసింది కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీనే అన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో సాగుతోంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలకుండా ఉండేటట్టు కాపాడింది ప్రియాంకగాంధీనే అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.సచిన్ పైలట్ కు ప్రస్తుతం పాత పదవులు ఇచ్చేటట్టు అతడి మద్దతుదారులైన ఎమ్మెల్యేలకు కొన్ని మంత్రి పదవులు ఇచ్చేటట్టు ప్రియాంక గాంధీ ఒప్పించినట్టు తెలిసింది. అలాగే వచ్చే ఎన్నికల క్యాంపెయిన్ అంతా సచిన్ పైలెట్ కు అప్పజెప్పి గెలిస్తే సీఎంను చేస్తాము అని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ మొత్తం ఎపిసోడ్ లో ప్రియాంక గాంధీ చొరవ తీసుకుందని.. 'నీవు నా తమ్ముడితో సమానం అని ప్రియాంక.. సచిన్ ను ఒప్పించిందని' ఢిల్లీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇలా వృద్ధ జంబూకాలను పక్కనపెట్టి ప్రియాంక గాంధీ సాహసమే చేశారు. ఆమెకు పార్టీలో ఇలా కీలక బాధ్యతలు అప్పగిస్తే పార్టీ బాగుపడుతుందని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ను వదిలిన నాయకులను తిరిగి కాంగ్రెస్ లోకి మళ్లి రప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. ప్రియాంక హామీతోనే సచిన్ కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు.

తాజాగా మరోసారి సచిన్ పార్టీ మార్పుపై ఈ ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి. ఈనెలలోనే గెహ్లాట్ మంత్రివర్గ విస్తరణతోపాటు రాజకీయ నియామకాలు చేపట్టనున్నారు. తాను లేవనెత్తిన అంశాలపై పార్టీ సరైన చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నట్టు సచిన్ పైలట్ గత నెలలో వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం గెహ్లాట్ మంత్రివర్గంలో ఆయనతో కలిపి 21 మంది మంత్రులు ఉండగా.. మరో తొమ్మిది మందికి చోటు కల్పించే అవకాశం ఉంది.