Begin typing your search above and press return to search.

మోడీ ప్రభుత్వంలో 8 ఏళ్లలో 25 శాతం రూపాయి విలువ పతనం

By:  Tupaki Desk   |   19 July 2022 8:30 AM GMT
మోడీ ప్రభుత్వంలో 8 ఏళ్లలో 25 శాతం రూపాయి విలువ పతనం
X
అచ్చే దిన్ అంటూ అధికారంలోకి వచ్చిన మోడీ పాలనలో రూపాయి విలువ పతనం అవుతూనే ఉంది. డాలరుతో రూపాయి మారకం విలువ చరిత్రలోనే తొలిసారి దారుణంగా దిగజారిపోయింది. డాలరుతో పోలిస్తే రూపూాయి విలువ మంగళవారం చరిత్రలో తొలిసారి 80 రూపాయిలు దాటి దిగజారింది. ఈ భారీ పతనంతో ప్రతిపక్షాలు, ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీలు నిరంతరం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.

బీజేపీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్ల నుంచి ఇప్పటివరకూ డాలర్ తో రూపాయి మారకం విలువ 25శాతం క్షీణించింది. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2014 డిసెంబర్లో మోడీ అధికారంలోకి వచ్చాక డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.63.33గా ఉండేది. 2022 జులై 11 నాటికి దాని విలువ 79.41కి పడిపోయింది. జూన్ 30న డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.78.94గా నమోదైంది. సోమవారం 16 పైసలు కోల్పోయి రూ.79.98వ వద్ద ముగిసింది. మంగళవారం వచ్చేసరికి రూ.80 దాటేసి ఆల్ టైం చరిత్రలోనే తొలిసారి అత్యంత క్షీణతను నమోదు చేసింది.

-రూపాయి విలువ పతనానికి కారణమేంటి?

రష్యా-ఉక్రెయిన్ పరిణామాలతో చమురు ధరలు పెరగడం.. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు రూపాయి విలువపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని మంత్రి పేర్కొన్నారు. భారత స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులను తరలించుకుపోవడం కూడా ఓ కారణం. 2022-23లో ఇప్పటివరకూ 14 బిలియన్ డాలర్ల ఎఫ్ఐఐలు తరలిపోయాయని మంత్రి తెలిపారు. డాలర్ తో రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో అందుకే రూ.80 దాటేసింది. భవిష్యత్తులోనూ 82కు పడిపోవచ్చునని నిపుణులు అంచనావేస్తున్నారు.

-డాలర్ ఎందుకు పెరుగుతోంది?

డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ చాలా బలహీనపడుతుంది. కరోనా కారణంగా ఎకనామీ మందగించిన తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. పశ్చిమ దేశాలు-రష్యాపై ఆంక్షలు విధించాయి. చాలా దేశాలు, రష్యా నుంచి క్రూడాయిల్ కొనడం ఆపేశాయి. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి.ఇది అమెరికా, యూరప్ లను కూడా ప్రభావితం చేసింది.యుద్ధం కారణంగా ఆహార పదార్థాలు, వంటనూనె తదితర వస్తువుల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అమెరికా, యూరప్ లు అత్యధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయి.

-మోడీ సర్కార్ వైఫల్యం..

రూపాయి విలువ బలహీనపడడానికి అతిపెద్ద కారణం ఆర్థిక వ్యవస్థ పతనం. అదుపులేని ద్రవ్యోల్బణం. వీటిని నియంత్రించడంలో మోడీ సర్కార్ వైఫల్యం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. మోడీ వచ్చాక ధరలు భారీగా పెరిగాయి. ఏదైనా కొనాలంటే కొరివి.. అమ్మాలంటే అడివిలా తయారైంది పరిస్థితి. ద్రవ్యోల్భణం కారణంగా ధరలు విపరీతంగా పెరుగుతండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా నిత్యావసరమైన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో సామాన్యులు జీవనం కష్టతంగా మారింది. పెట్రోల్‌ ధరలకు మాకు సంబంధం లేదని, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న క్రూడాయిల్‌ ధరలే నిర్ణయిస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే పెట్రోల్‌ ధరలు మిగతా వస్తువులు ధరలపై కూడా ప్రభావం చూపుతాయన్నది నిర్వివాదాంశం.

బీజేపీ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరలు అధికంగా పెంచుతోందని, దీని వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే రాముడి పాలన వస్తుందని చెప్పారు. కానీ ఇప్పటి ప్రజలు మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వం కంటే బీజేపీ ప్రభుత్వమే ఇష్టం వచ్చినట్లు జనాలను కష్టపెడుతోందని ఆరోపిస్తున్నారు. గతంలో నోట్ల రద్దుతో జనాలను ముప్పు తిప్పలు పెట్టి తీవ్ర అవస్థలకు గురి చేసింది. 'నోట్ల రద్దుతో ఇప్పుడు కష్టాలు పడుతారు కానీ ఆ తరువాత మీరే చెబుతారు నోట్లు ఎందుకు రద్దు చేశారని' మోడీ ఆ సందర్భంలో అన్నారు. కానీ నానాటికీ నగదు కష్టాలు ఇంకా తీరడం లేనేలేదు. కొత్తనోట్లు చలామణి అవుతున్నా అనుకున్న సమయానికి బ్యాంకుల్లో లేకపోవడం వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మరోవైపు జాతీయ బ్యాంకులు ఇష్టం వచ్చినట్లు రేట్లు విధించడం.. బ్యాంకుల్లో కనీస నిల్వలు లేకపోతే ఫైన్ల రూపంలో వసూలు చేయడం మొత్తానికి సామాన్యుడిని పీడిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకు దిగజారుతున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితి ఇలాగే సాగితే 'ఆదిత్య 369' సినిమాలో చూపించినట్లు రూ.1000 పెట్టి కూరగాయాలు కొనాల్సిన పరిస్థితి వస్తుందేమోనని సామాన్యులు భయపడుతున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా రాజకీయాలే ప్రధానంగా ముందుకు వెళ్తున్న కేంద్ర ప్రభుత్వ పనితీరును చూసి జనం అసహించుకుంటున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కేవలం ఉల్లిపాయ ధరలు పెంచినందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వాలను గద్దె దించిన ప్రజలు..మరి ఈసారి రూపాయి విలువ పతనం, జీఎస్టీ, నోట్ల రద్దు కష్టాలు, పెట్రో వాతలపై ఈ ప్రభుత్వాన్ని ఏం చేస్తారో చూడాలి..