Begin typing your search above and press return to search.

ఆ ప‌దం నిషిద్ధ‌మంటోన్న ఆర్ఎస్ఎస్ చీఫ్‌

By:  Tupaki Desk   |   8 Oct 2019 1:54 PM GMT
ఆ ప‌దం నిషిద్ధ‌మంటోన్న ఆర్ఎస్ఎస్ చీఫ్‌
X
ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ మంగళవారం గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ద‌స‌రా సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం మహారాష్ట్ర నాగ్ పూర్ లోని రేషింబాగ్ గ్రౌండ్స్ లో మోహన్ భగవత్ ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సహా సంఘ్ పరివార్ కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ పలు కీలక అంశాలపై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రశంసలతో పాటు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇమ్రాన్‌తో పాటు ప్ర‌త్య‌ర్థుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేశారు. తమ విషప్రచారాలు ఫలించని స్థితిలో పలువురు విమర్శకులు ఆరెస్సెస్‌పై విరుచుకుపడతారని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా సంఘ్‌పై విమ‌ర్శ‌లు చేసే వారిలో ఇమ్రాన్ కూడా ఉంటార‌ని ఆయ‌న ధ్వజమెత్తారు. త‌మ‌పై ఎవ‌రు ఎలాంటి దుష్ప్ర‌చారం చేసినా సంఘ్ బ‌య‌ప‌డ‌ద‌న్న విష‌యం ఇమ్రాన్ గుర్తుంచుకుంటే మంచిద‌ని ఆయ‌న త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

మూకదాడులు, మూక హత్యల వల్ల దేశం పరువు పోతోందన్న ఆయ‌న‌.. వీటిని అడ్డుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా దృష్టి సారించాల‌ని... మూక హత్యలు (లించింగ్) అనే పదం భారతీయ సంస్కృతికి సంబంధించినది కాదని, ఆ పదాన్ని ఎవరూ పలక వద్దని సూచించారు. మ‌న సంస్కృతికి సంబంధం లేని... మ‌న సంస్కృతిలో భాగం కాని ప‌దాల‌ను కొంద‌రు పాశ్యాత్తులు మ‌న‌పై రుద్దాల‌ని చూసే ప్ర‌య‌త్నాల‌కు మ‌నమంద‌రం చెక్ పెట్టాల‌ని సూచించారు.

ప్ర‌జాస్వామ్యం అనేది ఏ దేశం నుంచి దిగుమ‌తి చేసుకునే స‌రుకు కాద‌ని... దాని మూలాలు భార‌త్లో బ‌లంగా ఉన్నాయ‌న్నారు. భార‌త స‌రిహ‌ద్దు ప్రాంతాలు బ‌ల‌హీనంగా ఉన్నాయ‌న్న విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని... వీటిని మ‌రింత‌గా బ‌లోపేతం చేయాల్సి ఉంద‌ని ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించారు. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ర‌ద్దును మోదీ చేసిన అత్యంత సాహ‌సోపేత చ‌ర్య‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు.