Begin typing your search above and press return to search.

ఓయూ వీసీగా సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌

By:  Tupaki Desk   |   7 May 2016 7:03 AM GMT
ఓయూ వీసీగా సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌
X
తెలంగాణ‌లో ఉద్యమాలకు కేంద్రంగా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కొత్త కుల‌ప‌తిగా సీనియ‌ర్ పోలీస్ అధికారి రానున్నారా? ఉద్యమాలతో పాటు ఉన్నత విద్యకు - నాణ్యమైన విద్యకు - విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించే విధంగా ఉస్మానియాను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క అడుగులు వేస్తున్నారా? తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా సీనియ‌ర్‌ ఐపీఎస్‌ అధికారి - తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ను నియమించాలని ప్రభుత్వం పరిశీలిస్తుందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రెగ్యులర్‌ వీసీ లేకపోవడంతో ఇంచార్జీ వీసీ బాధ్యతలు ప్రస్తుతం విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య నిర్వర్తిస్తున్నారు. రెగ్యులర్‌ వీసీ కోసం ప్రభుత్వం గతనెల 25న ముగ్గురు సభ్యులతో సెర్చ్‌ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ సెర్చ్‌ కమిటీకి ఓయూ వీసీగా ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పేరును ప్రభుత్వం సిఫార్సు చేసినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం వీసీలుగా ఐపీఎస్‌ అధికారులు లేదా రిటైర్డ్‌ న్యాయమూర్తులు - విద్యావేత్తలను నియమించాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా విశ్వవిద్యాలయాల చట్టాన్ని మార్పులు చేర్పులు చేస్తోంది. అందులో భాగంగానే ఓయూ వీసీగా ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ను నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన నడిపిస్తూ ఎవరెస్ట్‌ శిఖరం ఎత్తుకు తీసుకెళ్లిన ఘనత సాధించిన ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌కుమార్ దక్కింది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ఆనంద్‌ - పూర్ణ ఎవ‌రెస్ట్‌ ను అధిరోహించి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. పదోతరగతి - ఇంటర్‌ ఫలితాల్లోనూ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్నీ సమర్థవంతంగా నిర్వహిస్తారన్న నమ్మకంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనవైపు మొగ్గుచూపుతున్నార‌ని తెలుస్తోంది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పించి ఓయూ వీసీ బాధ్యతలు అప్పగించే అంశాన్ని సీఎం యోచిస్తున్నట్టు సమాచారం. ఇదిలాఉండ‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఉన్న ప్రొఫెసర్లతోపాటు రిటైర్డ్‌ అయిన కొందరు ప్రొఫెసర్లూ వీసీ పదవిని ఆశిస్తున్నట్టు తెలిసింది.