Begin typing your search above and press return to search.

కిడారి కారులోని ఆ 3 కోట్లు ఏమైనట్టు.?

By:  Tupaki Desk   |   2 Oct 2018 5:50 AM GMT
కిడారి కారులోని ఆ 3 కోట్లు ఏమైనట్టు.?
X
విశాఖ మన్యంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు - మాజీ ఎమ్మెల్యే సోముల హత్యల తరువాత పోలీసుల విచారణలో విస్తుగొలిపే నిజాలు బయటపడుతున్నాయట.. ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఎమ్మెల్యే హత్య జరిగిన రోజు కిడారి ప్రయాణిస్తున్న కారులో రూ.3కోట్ల నగదు ఉన్నట్టు పోలీసులు విచారణలో తేలింది. డుంబ్రి గూడ మండలం లివిటిపుట్టు వద్ద గత నెల 23న ఎమ్మెల్యే - మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు హత్య చేయడం.. ఆ తర్వాత చెలరేగిన హింసాకాండపై నిజాలు నిగ్గుతేల్చాలని ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఇందులో పలువురు చురుకైన అధికారులను నియమించారు. వారి విచారణలోనే ఎమ్మెల్యే కారులో రూ.3కోట్ల నగదు ఉన్నట్టు గుర్తించినట్టు వార్త ప్రచారంలోకి వచ్చింది.

సిట్ చీఫ్ గా ఫకీరప్పను ప్రభుత్వం నియమించింది. ఈయన విశాఖ మన్యంలోనే మకాం వేసి అనుమానితులందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎమ్మెల్యే - మాజీ ఎమ్మెల్యేలను ట్రాప్ చేసిన వారిని విచారిస్తున్నారు. డుంబ్రిగూడ మండల టీడీపీ అధ్యక్షుడు - మాజీ ఎంపీటీసీతోపాటు టీడీపీకే చెందిన మాజీ ఎంపీపీ - అంత్రిగూడ గ్రామానికి చెందిన ఆరుగురు సహకరించిన వ్యక్తులను - పరిసర గ్రామాలకు చెందిన మొత్తం 10మందిని సిట్ బృందం అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. మాజీ ఎంపీటీసీ పాత్ర స్పష్టంగా ఉన్నట్టు నిర్ధారణకు వచ్చిన సిట్ బృందం అతడి కేంద్రంగానే లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇక టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు - అతని అనుచరగణం ఎమ్మెల్యే హత్య తర్వాత మన్యంలో కన్పించకపోవడంతో వారి ప్రమేయంపై సిట్ తీవ్రంగా ఆరాతీస్తోంది.

* ఆ మూడు కోట్లు ఏమయ్యాయి..?

కిడారి కారులో ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్న ఆ మూడు కోట్ల రూపాయలు హత్య అనంతరం మాయమయ్యాయి. దీంతో అవి ఏమయ్యాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎమ్మెల్యే కిడారి ఏదైనా సెటిల్ మెంట్ కోసం తీసుకెళ్తున్నారా.? లేక మావోలకు ఇవ్వడానికి పట్టుకెళ్లాడా అన్న విషయాలపై సిట్ బృందం ఆరాతీస్తోందట.. అయితే ఆయన సన్నిహితులను విచారించినప్పుడు మాత్రం సర్రాయి వద్ద మైనింగ్ సెటిల్ మెంట్ కోసమే ఆ డబ్బులు ఎమ్మెల్యే పట్టుకెళ్లినట్లు చెప్పినట్టు వార్త బయటకు పొక్కింది.