Begin typing your search above and press return to search.

ఖాతాలో రూ.10లక్షలు.. మెజార్టీ ఆప్షన్లు ఆ రెండింటి మీదనేనట!

By:  Tupaki Desk   |   9 Oct 2021 2:19 AM GMT
ఖాతాలో రూ.10లక్షలు.. మెజార్టీ ఆప్షన్లు ఆ రెండింటి మీదనేనట!
X
రూ.10లక్షల మొత్తాన్ని మీ ఖాతాలో వేస్తాం. మీకు నచ్చిన వ్యాపారం చేయండన్న మాట చెబితే ఏం జరుగుతుంది? దేశంలో మరే ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తుండటం తెలిసిందే. దళిత బంధు పేరుతో చేపట్టిన వినూత్న పథకంలో అర్హులైన లబ్థిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10లక్షల మొత్తాన్ని డిపాజిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టును సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రిలో షురూ చేయటం తెలిసిందే. ఇప్పటివరకు వాసాలమర్రిలో 18,064 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.10లక్షల మొత్తాన్ని జమ చేశారు.

మరి.. వీరంతా ఎలాంటి వ్యాపారాలు మొదలు పెట్టారు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే విస్మయానికి గురి చేసే వాస్తవం బయటకు వచ్చింది. ఎవరికి నచ్చిన వ్యాపారం వారిని చేయమంటే.. అత్యధికులు మాత్రం కార్లు.. ట్రాక్టర్లను మాత్రమే కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతుండటం గమనార్హం. మొత్తం 18 వేలల్లో దాదాపు ఎనిమిది వేల మంది పెట్టుకున్న ప్రతిపాదనల్లో 5440 మంది కారు కానీ ట్రాక్టర్ కానీ కొనుగోలు చేస్తామని చెబతున్నారు.

కొందరు కార్లను కొనుగోలు చేసి అద్దెకు ఇస్తామని చెప్పగా.. మరికొందరు క్యాబ్ ల రంగంలోకి అడుగు పెడతామని చెబుతున్నారు. మరికొందరు వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లను కొనుగోలు చేసి సొంతంగా నడిపిస్తామని చచెబుతున్నారు. అయితే.. ఎక్కువ మంది ట్రాక్టర్లు.. కార్లను మాత్రమే కొనుగోలు చేసిన పక్షంలో.. వారికి పని దొరికే అవకాశాలు తగ్గిపోతాయి. దీంతో.. పరిమిత సంఖ్యలో మాత్రమే ఇలాంటి యూనిట్లకు అవకాశం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

కార్లు.. ట్రాక్టర్లు కాక డిమాండ్ ఉన్న ఇతర రంగాలపై కూడా లబ్థిదారులకు అవగాహన కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. మరి.. అధికారుల సూచనలకు.. లబ్థిదారుల రియాక్షన్ ఎలా ఉండనుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెబుతున్నారు.