Begin typing your search above and press return to search.

బాబు త‌ప్పుకు మ‌హిళా అధికారి బ‌లిఃరోజా

By:  Tupaki Desk   |   3 Jan 2018 10:21 AM GMT
బాబు త‌ప్పుకు మ‌హిళా అధికారి బ‌లిఃరోజా
X
విజయవాడ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో తాంత్రిక పూజలు జరిగినట్టు వార్త‌లు రావడం క‌ల‌క‌లం రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌ లో ఆలయ ఈవో సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ప‌రిణామాన్ని వైఎస్‌ ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా త‌ప్పుప‌ట్టారు. సీఎం చంద్రబాబు తప్పుకు మహిళా అధికారిణిని బలి చేశారని ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. చిత్తూరులో రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు - ఆయన కుమారుడు ఎప్పటికీ అధికారంలో ఉండాలన్న స్వార్థంతో దుర్గగుడిలో తాంత్రిక పూజలు చేయించారని ఆరోపించారు. పవిత్రమైన అమ్మవారి సన్నిధిలో ఇలాంటి పూజలు చేయడం అరిష్టమని వ్యాఖ్యానించారు.

త‌న కొడుకు కోసం క్షుద్రపూజలు చేయించిన చంద్రబాబు అడ్డంగా దొరికిపోయేసరికి నెపాన్ని అధికారులపైకి నెడుతున్నారని రోజా ఆరోపించారు. గ‌తంలోనూ ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రించార‌ని మండిప‌డ్డారు. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసేలా కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేల‌ను కొన్న ఓటుకు నోటు కేసులో కూడా మ‌హిళా పోలీస్ అధికారిణి అయిన అనురాధ‌పై నెపం వేశార‌ని రోజా ఆరోపించారు. రాష్ట్రంలో మ‌హిళల‌కు భ‌ద్ర‌త లేద‌ని....మ‌హిళా అధికారులు కూడా అదే రీతిలో భ‌యంభ‌యంగా ఉన్నార‌ని వ్యాఖ్యానించారు.

గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా - ఇప్పుడు నాలుగేళ్లు అదే పదవిలో కొనసాగుతున్నా..చిత్తూరు జిల్లాకు ఆయన చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా వాసి అని చెప్పుకోవడానికి జిల్లా ప్రజలు సిగ్గుపడుతున్నారని ఎద్దేవా చేశారు. తనకు ఓటేయకపోతే ప్రజలే సిగ్గుపడాలన్న చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమని ఆమె ఖండించారు. లాభాల్లో ఉన్న విజయ డైరీని మూసివేసి - హెరిటేజ్‌ డైరీని ఏవిధంగా లాభాల బాటలో నడిపిస్తున్నారో అందరూ చూశారన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చక్కెర పరిశ్రమలు మూసివేశారని రోజా మండిపడ్డారు. వాటిని దివంగ‌త వైఎస్‌ రాజశేఖరరెడ్డి తెరిపించినా మళ్లీ వాటిని మూత వేయించారని రోజా మండిప‌డ్డారు. గాలేరు–నగరి ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్‌ లో కేటాయించకుండా ఇవాళ హంద్రీనీవా పూర్తి చేస్తానని చెప్పడం హాస్యస్పాదంగా ఉందన్నారు. సీమలోని నీటి ప్రాజెక్టులను పూర్తి చేయని చంద్రబాబు సిగ్గుపడాలని విమర్శించారు. రుణమాఫీ పేరుతో రైతులు - మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబు సిగ్గుపడాలని రోజా సూచించారు.