Begin typing your search above and press return to search.

కొత్త ఫూల్స్ డే ను సృష్టించిన చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   29 April 2018 9:50 AM GMT
కొత్త ఫూల్స్ డే ను సృష్టించిన చంద్ర‌బాబు
X
సాధార‌ణంగా ఫూల్స్ డే అంటే ఎప్పుడో అంద‌రికీ తెలిసిందే. అది ఏప్రిల్ 1వ తేదీ. అయితే ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు కొత్త ఫూల్స్‌ డే ను సృష్టించార‌ట‌. అది కూడా చిత్రంగా ఏప్రిల్ నెల‌లోనే. స‌రిగ్గా ఏప్రిల్ చివ‌ర‌న 30వ తేదీన‌. ఈ కొత్త సూత్రీక‌ర‌ణ చేసింది ఎవ‌రంటే...వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఎందుకు ఇలా రోజా విశ్లేషించారంటే...ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధర్మపోరాటదీక్ష చేస్తాననడంపై. ప్రత్యేక హోదాపై నాలుగేళ్లుగా మాట్లాడకుండా ఇప్పుడు ధర్మపోరాటదీక్ష అంటూ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు దీక్ష చేస్తున్నారంటూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో రోజా మాట్లాడుతూ కేంద్రంలో మంత్రి పదవులు అనుభవిస్తూ నాలుగేళ్లుగా విభజన చట్టంలోని అంశాలను రాష్ట్రంలో అమలు అయ్యేలా చేయడంలో టీడీపీ విఫలమైందని అన్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ధర్మపోరాటం చేస్తానననడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఏప్రిల్ 30 వ తేదీన రాష్ట్ర ప్రజలను ఫూల్స్ ను చేయడానికే టీడీపీ నాయ‌కుడు డ్రామాలకు పూనుకున్నారన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన చంద్రబాబును నమ్మక ద్రోహి అనడంలో ఎంతమాత్రం తప్పులేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఎంత అన్యాయం చేసిందో - అంతకు నాలుగు రెట్లు అధికంగా చంద్రబాబు ద్రోహం చేశారన్నారు.. హోదా పదేళ్లు కాదు - 15 ఏళ్లు కావాలని చెప్పి నాలుగేళ్లపాటు దానిని మరచిపోయారని, మరిచిపోయినట్లు నటించారని రోజా మండిప‌డ్డారు. విభజన చట్టంలోని అంశాలను సాధించకుండా వంచించిన వారిని నమ్మక ద్రోహం కాదా అని - అందుకు వారిని నమ్మక ద్రోహులు అనాలా వద్దా చెప్పాలని అడిగారు. హోదా కోసం పోరాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు - కార్యకర్తలపై కేసులుపెట్టి ఉద్యమాన్ని అణగదొక్కాలని చూసి, ఇప్పుడు ధర్మ పోరాటమంటూ డ్రామాలు చేయడం నీచమన్నారు. ప్రత్యేక హోదాను ఉరి తీసిన ఘనుడు చంద్రబాబు అయితే, దానిని సజీవంగా నిలిపిన నాయకుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని రోజా అన్నారు. ఇటీవల చంద్రబాబు చేసిన దీక్ష ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను తలపించింది తప్పితే, అందులో సీరియస్ నెస్ లేదన్నారు. ఇప్పుడు కూడా ఏప్రిల్ 30 వ తేదీన మరోసారి ప్రజలను ఫూల్స్ చేయడానికే ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారని ఆరోపించారు.

కుట్ర రాజకీయాలకు పేటెంట్ రైట్ చంద్రబాబుదే అని ప్రజలందరికీ తెలుసునని, అయితే ఇప్పుడు హోదా రాకుండా కుట్రు పన్నుతున్నారంటూ బాబు మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదంగా ఉందని రోజా అన్నారు. తన ముఖ్యమంత్రి పదవి కోసం వెన్నుపోటు, పార్టీ అధ్యక్ష పదవి కోసం కుట్ర చేసిందెవరో అందరికీ గుర్తుందని, అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై కేసులు పెట్టాలంటూ చీకట్లోచిదంబరం కాళ్లు పట్టుకున్నది, సోనియాగాంధీ ముందు మోకరిల్లిన చంద్రబాబు కుట్రలు బహిరంగ రహస్యాలేనని రోజా ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, పక్క రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్ర చేసి దొరికిపోయిన కుట్రదారులు , ఇప్పుడు కుట్రలు చేస్తున్నారంటూ గగ్గొలు పెట్టడం వింతగా ఉందన్నారు. ఇప్పుడు కూడా కేవలం నియోజకవర్గాల సంఖ్యలను పెంచితే చాలు హోదా వద్దంటూ ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టి కుట్రకు పాల్పడిందెవరో ప్రజలకు స్పష్టంగా తెలుసుని రోజా అన్నారు. గతంలో ఉద్యమాలను అణిచివేస్తూ కుట్ర రాజకీయాలకు పాల్పడిన చంద్రబాబు చెప్పే మాటలకు చేసే చేతలకు ఏమాత్రం పొంతన ఉండదని రోజా విమర్శించారు.