Begin typing your search above and press return to search.

అమ్మాయిల ఆత్మ‌హ‌త్య‌లు బాబుకు ఎందుకు ప‌ట్ట‌ట్లే?

By:  Tupaki Desk   |   7 Oct 2017 5:16 PM GMT
అమ్మాయిల ఆత్మ‌హ‌త్య‌లు బాబుకు ఎందుకు ప‌ట్ట‌ట్లే?
X
ఏపీ మంత్రి నారాయ‌ణ‌కు సంబంధించిన కాలేజీల్లో అమాయ‌క విద్యార్థిని విద్యార్థులు అక‌స్మాత్తుగా - అనుమానాస్ప‌దంగా మృత్యువాత ప‌డుతుండ‌టంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే - పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆర్కే రోజా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కష్టపడి చదువుకుందామని వచ్చిన విద్యార్థులు నారాయణ కాలేజీల శాడిజానికి బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విద్యాసంస్థలో జరగని విధంగా మూడున్నరేళ్లలో 30 మందికిపైగా విద్యార్థులు నారాయణ కాలేజీల్లో చనిపోతుంటే ప్రభుత్వం దున్నపోతు మీద వానపడిన చందాన వ్యవహరిస్తోందని అన్నారు. నారాయణ కళాశాలలు నరకానికి ప్రత్యక్షరూపాలుగా మారాయని ఆరోపించారు. ఇంత మంది విద్యార్థులు చనిపోతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వియ్యంకుడికి ఎప్పుడు సమస్య వచ్చినా స్క్రీన్ మీదకి వచ్చి అధికారులను బెదిరించడం, విచారణకు ఆదేశిస్తున్నామని స్ర్కోలింగ్ వేసుకోవడం తప్ప కాలేజీకి వెళ్లి ప్రత్యక్షంగా సమీక్షలు జరిపారా..? ఎవరిపైనైనా చర్యలు తీసుకున్నారా అనేది విద్యాశాఖ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు వెల్ల‌డించాల‌ని రోజా డిమాండ్ చేశారు. గంటా - నారాయణ లకు డబ్బుల మీద వ్యామోహం తప్ప ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనే లేదని..రాజధాని - విశాఖ భూముల విషయంలో ఏమైందో మనమంతా చూశామని రోజా అన్నారు.

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు బినామీ నారాయణ కాబట్టి పట్టించుకోవడం లేదా లేక విద్యాశాఖ మంత్రి వియ్యంకుడు కాబట్టి ఏ చర్యలు తీసుకోవడం లేదా అనే సందేహాలు అంద‌రిలో వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని రోజా వ్యాఖ్యానించారు.``పిల్లల ఆత్మహత్యలు చూస్తే మీ మనసు కరగడం లేదా...? తల్లిదండ్రుల గుండెకోత మీకు కనబడడం లేదా?మీ పిల్లలు - బంధువుల పిల్లలకు ఇదే గతి పడితే చూస్తూ ఊరుకుంటారా..? `` అని సీఎం చంద్ర‌బాబు, మంత్రులు నారాయణ - గంటా శ్రీనివాసరావులపై నిప్పులు చెరిగారు. 2015లో ఇదే కాలేజీలో మనీషా - నందినీలు చనిపోతే ఆ తల్లిదండ్రులకు శవాలు కూడ ఇవ్వకుండా దహనకార్యక్రమం చేయాలని చూశారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగన్ హుటాహుటిన వెళ్లి ఆ పిల్లల కోసం ధర్నాలు చేస్తే అప్పుడు తూతూమంత్రంగా కమిటీ వేశారని, రెండేళ్లవుతున్నా ఎంతవరకు ఆ రిపోర్ట్ ఏమైందో ఎవరికి తెలియదని రోజా తెలిపారు. నారాయణ కాలేజీపై ఒక్క కేసు కూడ నమోదు చేయలేదు కాబట్టే కర్నూలు - తిరుపతి - రాజమండ్రి ఇలా ప్రతిచోట విద్యార్థులు చచ్చిపోతున్నారని అన్నారు. అయినా ఆ విద్యాసంస్థలకు భయం గానీ - బాధ గానీ లేదని అన్నారు. ఎవరూ ఏం చేయలేరన్న అహంకారంతో ముందుకుపపోతున్నారని ఫైర్ అయ్యారు.

ముఖ్యమంత్రి నివాసప్రాంతంలోని విజయవాడ శివారు గూడెపల్లి నారాయణ కాలేజీలో ఈశ్వర్ రెడ్డిని కాలేజీ సిబ్బంది కొట్టి చంపితే విద్యాశాఖ మంత్రి గంటా అక్కడకి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడ చేయలేదన్నారు. నారాయణ సొంత జిల్లా నెల్లూరులోని గూడూరులో దిలీప్ అనే విద్యార్థిని కర్ణబేరి పగిలిపోయేలా కొట్టిస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. 2015లో విద్యార్థుల ఆత్మహత్యలపై మాజీ వీసీ రత్నకుమారి - ఐఏఎస్ చక్రపాణి నేతృత్వంలో విచారణ కమిటీ వేశారని.. వారు మీకు అక్కడి పరిస్థితులు తెలియజేసినప్పుడు ఏం చర్యలు తీసుతున్నారో శ్వేతపత్రం విడుద‌ల‌ చేయాలని డిమాండ్ చేశారు. `మీకు మనసు మానవత్వం ఉంటే, మీరు ఏ తప్పు చేయలేదనుకుంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలి. ఇన్ని చావులకు కారణమైన నారాయణ - గంటాలను బర్తరఫ్ చేయాలి. ఇక మీదట రాష్ట్రంలో అక్రమంగా నడుస్తున్న నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఏ విద్యార్థి హత్య - ఆత్మహత్య జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీఎంపైనే ఉంది`` అని రోజా స్ప‌ష్టం చేశారు.

చంద్రబాబుకు ఆడపిల్ల లేదు కాబట్టే వారు చనిపోతుంటే ఆ బాధ తెలియడం లేదని రోజా అన్నారు. ఆయన అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాల శాతం పెరుగుతూనే ఉందని, ఈ విషయాన్ని పోలీస్ రికార్డ్ స్పష్టం చేసిందన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత ఊడితే ఎంత అని రోజా అన్నారు. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు, మేం తలచుకుంటే ఏమైనా చేస్తామన్న కండకావరంతో నారాయణ విద్యాసంస్థలు ఉన్నాయని మండిపడ్డారు. ఒకే విద్యాసంస్థలో ఇంతమంది చనిపోతున్నా యాజమాన్యం - అధిపతి నారాయణపై ఎలాంటి కేసులు, విచారణ లేకుపోవడం బాధకరమన్నారు. నారాయణ ఇచ్చే వందల కోట్లు మీ నోరు. కళ్లు కుట్టేశాయా బాబూ..? అని ప్రశ్నించారు.