Begin typing your search above and press return to search.

బెంగాల్ బీజేపీలో పెరిగిపోతున్న టెన్షన్

By:  Tupaki Desk   |   6 March 2021 3:37 AM GMT
బెంగాల్ బీజేపీలో పెరిగిపోతున్న టెన్షన్
X
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బెంగాల్ బీజేపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మమతబెనర్జీని ఎలాగైన దెబ్బ కొట్టాలన్న లక్ష్యంతో దొరికిన ప్రతి వాళ్ళని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి అగ్రనేతలు బీజేపీలోకి చేర్చుకున్నారు. సుమారు 29 మంది ఎంఎల్ఏలు, ఒక ఎంపితో పాటు అనేకమంది సీనియర్ నేతలు బీజేపీలో చేరారు. అప్పట్లో మమతను దెబ్బ కొట్టడానికే బీజేపీ అగ్రనేతలు ఇదంతా చేశారు. తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి ఆ చేరికలే ఇపుడు రావర్సవుతున్నాయి.

తృణమూల్ కు చెందిన మమతకు ఎంతో సన్నిహితులైన సుబేందు అధికారి లాంటి వాళ్ళను పార్టీలోకి చేర్చుకుని బీజేపీ అగ్రనేతలు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో సుబేందు లాంటి నేతల పెత్తనం బీజేపీలో పెరిగిపోయింది. ఇది కమలంపార్టీలోని సీనియర్ నేతల్లో మంటలు మండిస్తోంది. దశాబ్దాల పాటు పార్టీకోసం పనిచేస్తున్న తమపై ఫిరాయింపు నేతల పెత్తనం ఏమిటంటే ఒరిజినల్ బీజేపీ నేతలు చాలా చోట్ల మండిపోతున్నారట.

ఫిరాయింపు నేతల నేతృత్వంలో తాము పనిచేసేది లేదని అగ్రనేతలకు తెగేసి చెబుతున్నారట. తృణమూల్ నుండి వచ్చిన సుబేందు, జితేంద్ర తివారి లాంటి నేతలను కొందరు కేంద్రమంత్రులు ఎప్పటినుండో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ఇదిలా ఉండగానే సీనియర్ నేత రాహూల్ సిన్హాను కాదని ఫిరాయింపు నేత అనుపమ్ భద్రకు కార్యదర్శి పదవిని ఇచ్చింది జాతీయ పార్టీ. దాంతో రాహూల్ తో పాటు ఆయన మద్దతుదారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

జితేంద్ర తివారి రాకను ప్రశ్నించినందుకు కేంద్రమంత్రి బాబూ సుప్రియోతో పాటు అగ్నిద త్రిపాల్ కు జాతీయ పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీంతో ఒరిజినల్ సీనియర్ నేతలంతా ఏకమై జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై మండిపోతున్నారు. ఇదంతా మోడి, అమిత్ షా ఆదేశాల ప్రకారమే నడ్డా నడుచుకున్నట్లు తేలటంతో సీనియర్లు రగిలిపోతున్నారు. కొత్తవాళ్ళను అందలం ఎక్కించటంతో ఒరిజినల్ నేతల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోందట. దీంతో చాలా జిల్లాల్లో ఒరిజినల్-ఫిరాయింపు నేతల వర్గాల మధ్య పెద్దస్ధాయిలోనే గొడవలవుతున్నాయి.

మొత్తానికి మమతను ఏదో చేద్దామని కేంద్రప్రభుత్వ పెద్దలు చేసిన ప్రయత్నం సరిగ్గా ఎన్నికల ముందు వికటిస్తోందనే విషయం బయటపడుతోంది. దీంతో ఒరిజినల్ నేతలు ఎక్కడ సొంత అభ్యర్ధులకు హ్యాండ్ ఇస్తారో అనే టెన్షన్ బీజేపీ అగ్రనేతల్లో పెరిగిపోతోంది. చివరకు ఒరిజినల్-ఫిరాయింపు నేతల మధ్య పెరిగిపోతున్న ఆధిపత్య వివాదాలు పార్టీని పుట్టి ముంచేస్తాయనే విషయం అర్ధమవుతోంది. అయితే ఈ దశలో ఎవరు చేయగలిగేదీమీ లేదు. మొత్తానికి కమలంపార్టీ అగ్రనేతల వ్యవహారం భస్మార హస్తాన్ని గుర్తుకు తెస్తోంది.