Begin typing your search above and press return to search.

బీజేపీలోకి రేవంత్ ఆప్త మిత్రుడు.. లెక్క‌లు మారుతున్నాయా?

By:  Tupaki Desk   |   5 May 2022 6:05 AM GMT
బీజేపీలోకి రేవంత్ ఆప్త మిత్రుడు.. లెక్క‌లు మారుతున్నాయా?
X
రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండర‌నే విష‌యం ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఢిల్లీ నుంచి మొద‌లుకొని మ‌న గ‌ల్లీ వ‌ర‌కు ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. తాజాగా టీపీసీసీ ర‌థ‌సార‌థి రేవంత్ రెడ్డి విష‌యంలో ఈ సంద‌ర్భం మ‌రోమారు రుజువు కానుంద‌ని అంటున్నారు.

రేవంత్‌తో స‌న్నిహితంగా ఉన్న ఓ మాజీ ఎంపీ ఇప్పుడు కాషాయా కండువా క‌ప్పుకొనేందుకు స‌ర్వం సిద్ధం చేసుకున్నార‌ని టాక్ వినిప‌స్తోంది. ఆయ‌నే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి.

కాంగ్రెస్‌ను వీడిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఆ తర్వాత మ‌రే పార్టీలోనూ చేర‌లేదు. హైద‌రాబాద్‌లో ఆంక్ష‌లున్న 111 జీవో ప‌రిధిలో మంత్రి కేటీఆర్ ఓ ఫాం హౌస్ క‌ట్టుకున్నార‌ని పేర్కొంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో క‌లిసి ఆందోళ‌న‌లు చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి రాజ‌కీయంగా వివిధ సంద‌ర్భాల్లో త‌న గ‌లం వినిపిస్తున్నారు.

అయితే, కొండా బీజేపీలో చేరుతారనే ప్రచారం ఇటీవ‌ల తెర‌మీద‌కు వ‌చ్చింది. దీన్ని నిజం చేస్తూ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు..

మహబూబ్ నగర్ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర చేస్తుండగా అక్కడికి వెళ్లిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. సమావేశానికి ముందు ఆయన బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితోనూ భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

గురువారం మహబాబూబ్ నగర్‌లో ఏర్పాటు చేస్తున్న సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్న నేపథ్యంలో బీజేపీ నేతలతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. తాజా పరిణామంతో జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ ప‌రిణామం రేవంత్ రెడ్డికి షాక్ వంటిద‌నే అంటున్నారు.