Begin typing your search above and press return to search.

బీజేపీలోకి రేవూరి... రేపే ముహూర్తం!

By:  Tupaki Desk   |   3 Sep 2019 4:18 PM GMT
బీజేపీలోకి రేవూరి... రేపే ముహూర్తం!
X
ఇప్పటికే తెలంగాణలో దాదాపుగా చచ్చిపోయిన తెలుగు దేశం పార్టీకి మరో గట్టి దెబ్బ రెడీ అయిపోయింది. తెలుగు నేల విభజన తర్వాత నుంచి తెలంగాణలో టీడీపీ క్రమక్రమంగా చిక్కిపోతున్న సంగతి తెలిసిందే. కేడర్ ఓ మాత్రంగా ఉన్నా... నేతలు మాత్రం ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇప్పటికే మెజారిటీ నేతలు అటు టీఆర్ ఎస్సో - ఇటు కాంగ్రెస్సో - లేదంటే బీజేపీలోనే చేరిపోతూ ఉంటే... ఆ చేరికలను చూస్తూ మిన్నకుండిపోవడం మినహా పార్టీ అధిష్ఠానం ఏమి చేయలేని పరిస్థితి. ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న కీలక నేతలు ఎవరంటే తడుముకోవాల్సిన దుస్థితి వచ్చిందంటే... పరిస్థితి ఏమిటో ఇట్టే చెప్పేయొచ్చు. ఇలాంటి క్రమంలో పార్టీలో కీలక నేతగా ఉన్న రేవూరి ప్రకాశ్ రెడ్డి కూడా రేపు పార్టీకి వీడనున్నారు. టీడీపీకి గుడ్ బై చెప్పనున్న రేవూరి... బీజేపీలో చేరిపోతున్నారు.

రేవూరి పార్టీ మారే విషయానికి సంబంధించి ఇప్పటికే క్లారిటీ వచ్చినా... పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ రావడంతో పాటుగా పార్టీకి ఏ ఇబ్బంది వచ్చినా... తానున్నానంటూ ధైర్యంగా నిలబడే నేతల్లో ఒకడిగా పేరున్న రేవూరి పార్టీ మారుతున్నారంటే నమ్మడానికి చాలా మంది సంశయించారు. అయితే సీఎం రమేశ్ - సుజనా చౌదరిలతో పాటు తెలంగాణ నేపథ్యమున్న గరికపాటి మోహన్ రావు కూడా పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత... రేవూరి పార్టీ మారడంలో పెద్దగా ఆశ్యర్యమేమీ లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు టచ్ లోకి రాగానే... పార్టీ మారేందుకు రేవూరి కూడా ఓకే అన్నారట.

ఇక రేవూరి టీడీపీని వీడి బీజేపీలోకి చేరడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందట. రేపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ హస్తిన పర్యటనకు వెళుతున్నారు. లక్ష్మణ్ తో పాటు రేవూరి కూడా రేపు ఉదయం ఢిల్లీ ఫ్లైటెక్కుతున్నారట. ఢిల్లీలో అడుగుపెట్టగానే... రేవూరి వెంటేసుకుని లక్ష్మణ్... బీజేపీ జాతీయ అధ్యక్షుడు - కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారట. ఈ సందర్భంగానే అమిత్ షా సమక్షంలో రేవూరి బీజేపీలో చేరిపోతారట. ఈ మేరకు కమలనాథులు గీసిన ప్లాన్ ను లక్ష్మణ్ అమలు చేస్తున్నారట. ఇదిలా ఉంటే... రేవూరితో పాటు తెలంగాణకు చెందిన సీనియర్ పొలిటీషియన్ రవీంద్రనాయక్ కూడా బీజేపీలో చేరతారట.