Begin typing your search above and press return to search.

పొత్తుల చద‌రంగంలో ఆ టీడీపీ నేత పావు?

By:  Tupaki Desk   |   23 Aug 2018 2:30 PM GMT
పొత్తుల చద‌రంగంలో ఆ టీడీపీ నేత పావు?
X
2019 ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ తెలంగాణ‌లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. మ‌రోసారి అధికారాన్ని చేప‌ట్టాల‌న్న ల‌క్ష్యంతో టీఆర్ ఎస్ పావులు క‌దుపుతుంటే....టీఆర్ ఎస్ ను గ‌ద్దె దించేందుకు కాంగ్రెస్ - టీడీపీలు పొత్తు పెట్టుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి.

అయితే, వాస్త‌వానికి ఏ పార్టీకైనా పొత్తులు బ‌లాన్ని పెంచుతాయి. అధికారం ద‌క్కించుకునేందుకు నిచ్చెన‌లా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కానీ, తెలంగాణ‌లో కాంగ్రెస్ తో పొత్తుల వైకుంఠ‌పాళిలో కొంద‌రు టీడీపీ నేత‌లు వేటుకు గురికావాల్సి వ‌స్తోంది. పొత్తుల కోసం త్యాగాలు చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. తెలంగాణ‌లోని న‌ర్సం పేట‌లో మూడు సార్లు టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలిచిన రేవూరి ప్ర‌కాష్ రెడ్డి...ఆ పొత్తుల చ‌ద‌రంగంలో పావుగా మారార‌ని ఆయ‌న అనుచ‌రులు ఆవేద‌న చెందుకుతున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ పై కాంగ్రెస్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన దొంతి మాధ‌వ రెడ్డి విజ‌యం సాధించారు. అయితే, రాబోయే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించడ‌మే ల‌క్ష్యంగా `ప‌ల్లె ప‌ల్లెకు రేవూరి` అనే కార్య‌క్ర‌మాన్ని ప్ర‌కాష్ చేప‌ట్టారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఊరూరా పాద‌యాత్ర చేస్తున్నారు. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే మాధ‌వ రెడ్డికి మ‌రోసారి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. దీంతో, ఒక వేళ కాంగ్రెస్ తో పొత్తుంటే...రేవూరి ఆశ‌ల పై నీళ్లు చ‌ల్లిన‌ట్లేన‌ని ఆయ‌న అనుచ‌ర వ‌ర్గం దిగాలు చెందుతోంది. పోనీ, మ‌రో నియోజ‌క‌వ‌ర్గం నుంచి రేవూరి పోటీ చేసిన గెలుపుపై ఆశ‌లు పెద్ద‌గా లేవు. ఇక ఆయ‌న‌ ఇండిపెండెంట్ గా బ‌రిలోకి దిగుతారా అన్న‌ది మిలియిన్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. అందులోనూ, 2019 త‌ర్వాత పొలిటిక‌ల్ రిటైర్మెంట్ అని రేవూరి డిసైడ్ అయ‌న నేప‌థ్యంలో న‌ర్సాపురం సీటు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.