Begin typing your search above and press return to search.

పోలవరం రివర్స్ టెండరింగ్ ఇలా.. ఇతర రాష్ట్రాల్లోని కంపెనీలైనా టెండర్

By:  Tupaki Desk   |   17 Aug 2019 6:28 AM GMT
పోలవరం రివర్స్ టెండరింగ్ ఇలా.. ఇతర రాష్ట్రాల్లోని కంపెనీలైనా టెండర్
X
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందాలు, కుదిరిన కాంట్రాక్టులు అన్నిటినీ పున:సమీక్షిస్తున్న క్రమంలో వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులకూ మళ్లీ టెండర్లు పిలుస్తోంది. శనివారం దీనికి సంబంధించిన ప్రకటన జారీ కానుంది. దీనికోసం ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. శుక్రవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఈ మేరకు జీవో జారీ చేశారు. చీఫ్‌ ఇంజినీర్ల బోర్డు 22 జులై, 2019న చేసిన సిఫార్సుల మేరకు వీటిని రూపొందించారు. కాగా.. ఈ రివర్స్ టెండరింగ్ మార్గదర్శకాలపై విపక్షాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా సంస్థలకు టెండర్లు ఇచ్చేలా నిబంధనలు సవరించడం.. చిన్నచిన్న ప్యాకేజీలుగా కూడా పనులిచ్చేయాలని నిర్ణయించడంతో ఇది వైసీపీ పెద్దల బినామీ సంస్థలకు.. పెద్దసంఖ్యలో వైసీపీ నేతలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు వేస్తున్న పన్నాగమని విపక్షం విమర్శిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల్లో మొత్తం 29 అంశాలున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం గుత్తేదారుకు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ ఉండాల్సిన అవసరం లేదు. జాయింట్‌ వెంచర్‌ సంస్థలను ప్రోత్సహించాలని, ఎక్కువ మంది గుత్తేదారులు ప్రక్రియలో పాల్గొనేలా చూడాలని నిర్ణయించారు. ప్రస్తుతం పనులను నిర్వహించే గుత్తేదారు సంస్థ కూడా రివర్స్‌ టెండరింగ్‌ లో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. అలాగే ఆశించిన స్థాయిలో సంస్థలు స్పందించని పక్షంలో పనులను చిన్న ప్యాకేజీలుగా విభజించనున్నారు. ప్రాజెక్టు కాంట్రాక్టు ఒప్పందాలపై న్యాయ సమీక్ష అనంతరం రివర్స్‌ టెండరింగ్‌ కు సిద్ధమవుతారు. ప్రస్తుత గుత్తేదారు ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలని, న్యాయపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రాజెక్టు ప్రస్తుత కాంట్రాక్టు సంస్థను తప్పించిన తర్వాత మిగిలిన పనుల విలువను అసలు ఒప్పంద రేట్లతోనే అంచనా వేస్తారు. దీనికి ఐబీఎం విలువ, అంచనా కాంట్రాక్టు విలువ ఆధారంగా రివర్స్‌ టెండరింగ్‌ విలువ నిర్ణయిస్తారు. టెండర్లు వేసేవారు సాంకేతిక, ఆర్థిక అంశాలకు సంబంధించి దాఖలు చేసిన పత్రాల్లో ఏవైనా లోపాలు ఉంటే తీవ్ర చర్యలు. ఈఎండీ జప్తు. ప్రస్తుతం ఉన్న ఈ-పొక్యూర్‌ మెంట్‌ విధానంలో మార్పు.

అర్హత పొందిన గుత్తేదారులు ప్రైస్‌ బిడ్‌ తర్వాత ఈ-ఆక్షన్‌ లో పాల్గొనాలన్న కొత్త నిబంధన జోడించారు. గుత్తేదారులు ప్రైస్‌ బిడ్‌ దాఖలు చేసిన తర్వాత.. తక్కువ ధర కోట్‌ చేసిన వారిని గుర్తిస్తారు. పేర్లను బయటకు వెల్లడించరు. రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ నిర్వహించటానికి కనీసం ఇద్దరు గుత్తేదారులు ఉండాలి. రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియలో ఎల్‌1 మొత్తం ప్రారంభ ధరగా ఉంటుంది. అక్కడి నుంచి గుత్తేదారులు పోటీ పడి తక్కువ ధరను కోట్‌ చేయాలి. ప్రైస్‌ బిడ్‌ పూర్తయిన తర్వాత మూడు గంటలకు రివర్స్‌ టెండరింగ్‌ ప్రకియ ప్రారంభం అవుతుంది. 15 నిమిషాల వ్యవధిలో గుత్తేదారులు ఈ-ఆక్షన్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. గుత్తేదారు తక్కువ ధర కోట్‌ చేస్తే, అక్కడి నుంచి మళ్లీ 15 నిమిషాల వ్యవధి ఉంటుంది. రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎల్‌-1 మొత్తం మాత్రమే కనిపిస్తుంది. ఐబీఎం లేదా అంచనా కాంట్రాక్టు విలువలో కనీసం 0.5 శాతం తక్కువ మొత్తాన్ని గుత్తేదారు నమోదు చేయాలి. నిర్దేశిత వ్యవధి పూర్తయిన తర్వాత తక్కువ మొత్తాన్ని కోట్‌ చేసిన గుత్తేదారునికి పనులను కేటాయిస్తారు. రివర్స్‌ టెండరింగ్‌ లో పనులు దక్కించుకున్న గుత్తేదారు 24 గంటల వ్యవధిలో ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలి