Begin typing your search above and press return to search.

కేసీఆర్ త‌ప్పును పున‌రావృతం చేస్తున్న రేవంత్‌..!

By:  Tupaki Desk   |   15 July 2022 7:30 AM GMT
కేసీఆర్ త‌ప్పును పున‌రావృతం చేస్తున్న రేవంత్‌..!
X
తెలంగాణ సీఎం కేసీఆర్ బాట‌లోనే టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ ప‌య‌నిస్తున్నారా..? ఆయ‌న చేసిన త‌ప్పును స‌రిచేయ‌కుండా అదే రిపీట్ చేస్తున్నారా..? అదే ఒర‌వ‌డి కొన‌సాగిస్తే టీపీసీసీ పుట్టి మున‌గడం ఖాయ‌మేనా..? పార్టీ సీనియ‌ర్లు ఈ విష‌యంపైనే రేవంతును నిల‌దీస్తున్నారా..? అయినా వీటిని లెక్క‌చేయకుండా ముందుకు సాగుతున్నారా..? అంటే పార్టీ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి.

ఆ త‌ప్పు ఏదో కాదు పార్టీలో చేరిక‌ల అంశం. ఇటీవ‌ల ఇత‌ర పార్టీల నుంచి ఇబ్బ‌డిముబ్బ‌డిగా కాంగ్రెసులో చేరిక‌లు జ‌రుగుతుండ‌డ‌మే ఇందుకు కార‌ణం. తొలుత చెన్నూరు మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు, ఆయన స‌తీమ‌ణి మంచిర్యాల జ‌డ్పీటీసీ ఢిల్లీలో ప్రియాంక గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెసులో చేరారు. ఆ త‌ర్వాత గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప్రాంతానికి చెందిన మేయ‌ర్‌, పీజేఆర్ కుమార్తె విజ‌యారెడ్డికి రేవంతు పార్టీ కండువా క‌ప్పారు.

ఆ త‌ర్వాత అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంక‌టేశ్వ‌ర్లు, క‌ర‌క‌గూడెం జ‌డ్పీటీసీ కాంతారావు హ‌స్తం గూటికి చేరారు. అలాగే రేవంత్ స‌న్నిహితుడు మాజీ మంత్రి బోడ జ‌నార్ద‌న్‌, రావి శ్రీ‌నివాస్ వ‌చ్చి చేరారు. ఆ వెంట‌నే రేవంత్ స‌న్నిహితుడు జ‌డ్చ‌ర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖ‌ర్, దేవ‌ర‌కొండ మాజీ ఎమ్మెల్యే బాలు నాయ‌క్ హ‌స్తం కండువా క‌ప్పుకున్నారు. వీరంతా కాంగ్రెస్‌, బీజేపీలో ముఖ్య‌మైన స్థానాల్లో ఉన్న‌వారే.

వీరే కాకుండా పార్టీలో మ‌రిన్ని చేరిక‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లో టీఆర్ఎస్‌, బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప‌లువురు సీనియ‌ర్లు హ‌స్తం గూటికి చేర‌తార‌ని.. వీరు ఆయా స్థానాల్లో టికెట్లు డిమాండ్ చేస్తున్నార‌ని స‌మాచారం. ఇలా అంద‌రి చేరిక‌ల‌తో పార్టీ ఓవ‌ర్ లోడ్ అయ్యి మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని పార్టీ సీనియ‌ర్లు వ్యాఖ్యానిస్తున్నారు. మొద‌టి నుంచీ పార్టీ కోసం ప‌నిచేస్తున్న వారు.. టికెట్ల రేసులో ఉన్న వారు కొత్త వారి చేరిక‌పై అసంతృప్తిగా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

టీఆర్ఎస్ కూడా రెండోసారి గెలిచిన జోష్ లో వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించింది. మొద‌టిసారి 60కి పైగా.. రెండోసారి 88 స్థానాల‌ను ఇచ్చి ప్ర‌జ‌లు ఆద‌రిస్తే ఇవి చాల‌వ‌న్న‌ట్లు కేసీఆర్ ప్ర‌వ‌ర్తించార‌ని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మందిని, టీడీపీకి చెందిన ఇద్ద‌రిని చేర్చుకొని ప్ర‌తిప‌క్షాల‌ను బ‌ల‌హీన ప‌రిచారు. కొంద‌రికి మంత్రి ప‌దువులు కూడా క‌ట్ట‌బెట్టారు. ఇపుడు ఆ పార్టీకి అదే స‌మ‌స్య‌గా మారింది. ఇత‌ర పార్టీల నుంచి గెలిచి వ‌చ్చిన వారు.. గ‌తంలో ఓడిన వారి మ‌ధ్య సీట్ల పంచాయితీ జ‌రుగుతోంది.

జూప‌ల్లి-బీరం, మ‌హేంద‌ర్ రెడ్డి-రోహిత్ రెడ్డి, తుమ్మ‌ల‌-కందాళ‌, హ‌రిప్రియ‌-కోరం క‌న‌క‌య్య‌, సండ్ర‌-పిడమ‌ర్తి ర‌వి, స‌బిత‌-తీగ‌ల‌, చిరుమ‌ర్తి-వేముల‌.. ఇలా ప‌లు జిల్లాల్లో పాత కొత్త వారి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం న‌డుస్తోంది. ఎవ‌రికి టికెట్ ఇచ్చినా మ‌రో వ‌ర్గం స‌హ‌క‌రిస్తుంద‌నేది అనుమాన‌మే. ఇలా కారు ఓవ‌ర్ లోడ్ కావ‌డంతో నేత‌లు ప‌క్క చూపులు చూస్తున్నారు. రేవంత్ రూపంలో బ‌లంగా క‌న‌ప‌డుతున్న కాంగ్రెస్ లోకి వ‌ల‌స‌లు జోరందుకుంటున్నాయి. మ‌రి అక్క‌డా ఇదే ప‌రిస్థితి ఉంటుందా..? కేసీఆర్ త‌ప్పును రేవంత్ రిపీట్ చేస్తున్నారా..? లేదా పార్టీ బ‌లోపేతం కోసం వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారా అనేది త్వ‌ర‌లో తేల‌నుంది. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!