Begin typing your search above and press return to search.

మంత్రి మల్లారెడ్డి అరాచకాలెన్నో.. చిట్టా విప్పిన రేవంత్

By:  Tupaki Desk   |   24 May 2022 3:27 AM GMT
మంత్రి మల్లారెడ్డి అరాచకాలెన్నో.. చిట్టా విప్పిన రేవంత్
X
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మాటలు ఎంతలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఆయన ఏదైనా విషయాన్ని టార్గెట్ చేస్తే.. ఆ విషయాన్ని అరటి పండు తొక్క వొలిచి.. నోట్లో పెట్టిన చందంగా వివరంగా చెప్పేస్తుంటారు.

అంతేకాదు.. ఇంతలా వాస్తవం ఉందా? అన్న భావన కలిగేలా చేస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరే ఆయన మాటలు ఆసక్తికరంగానే కాదు.. ఎంతసేపు విన్నా.. విసుగు కలగని రీతిలో ఉండటం ఆయనకో ప్లస్ పాయింట్ గా చెబుతుంటారు.

తాజాగా ఆయన మంత్రి మల్లారెడ్డిని లక్ష్యంగా చేసుకొని సంచలన ఆరోపణలు చేశారు. అక్కడితో ఆగని ఆయన.. మంత్రికి ఘాటు వార్నింగ్ ఇచ్చేయటం మరో ఆసక్తికర పరిణామంగా చెప్పాలి.

మంత్రి మల్లారెడ్డి అచ్చొసిన ఆంబోతులా తయారయ్యారంటూ ఘాటు విమర్శతో మొదలు పెట్టిన రేవంత్.. రెవెన్యూ చట్టాన్ని అడ్డం పెట్టుకొని వందలాది ఎకరాల్ని కాజేశారంటూ ఆరోపించారు. ఇందుకు సాక్ష్యంగా కొన్ని వివరాల్ని వెల్లడించారు.

"మూడు చింతలపల్లి , కేశవాపూర్ లో మంత్రి మల్లారెడ్డి 150 ఎకరాలు అగ్గువకు కాజేసిండు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మల్లారెడ్డి అక్రమాల పై విచారణ జరిపిస్తాము. బొక్కలో వేస్తాం. మల్లారెడ్డి అక్రమాలు.. అరాచకాలపై ఏసీబీ, విజిలెన్స్ ద్వారా చేయిస్తాం.మేం అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ జరిపిస్తాం" అని పేర్కొన్నారు. అంతేకాదు.. మంత్రి మల్లారెడ్డి.. ఆయన అల్లుడిని బొక్కలో తోస్తామంటూ ఘాటుగా రియాక్టు అయ్యారు.

తన వ్యాఖ్యలకు జస్టిఫికేషన్ ఇచ్చుకునే క్రమంలో ఆయన మాట్లాడుతూ.. "గుండ్లపోచంపల్లిలో పార్కు ను తొలగించి రోడ్డు వేసుకున్నడు. ఆయన అల్లుడు చెరువు ను కబ్జా చేసి కాలేజ్ నిర్మించారు. జవహర్ నగర్ లో ప్రభుత్వ భూమి కబ్జా చేశారు. వీటన్నింటిపై మేం అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఆధారాలతో సహా నిరూపిస్తాం" అని ఫైర్ అయ్యారు. మంత్రి మల్లారెడ్డిపైనా.. ఆయన అల్లుడు పైన రేవంత్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.