Begin typing your search above and press return to search.

శవాసనం వేసి బోటు ప్రమాదం నుండి బయట పడ్డాడట

By:  Tupaki Desk   |   16 Sept 2019 11:56 AM IST
శవాసనం వేసి బోటు ప్రమాదం నుండి బయట పడ్డాడట
X
తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో పలువురు మృత్యువాత పడగా కొందరు గల్లంతయ్యారు. మరి కొందరు అదృష్టం కొద్ది ప్రాణాలతో బయట పడ్డారు. ఈ బోటు ప్రమాదం నుండి హైదరాబాద్‌ కు చెందిన రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి జానకి రామారావు బయట పడ్డారు. ప్రస్తుతం ఈయన హాస్పిటల్‌ లో కోలుకుంటున్నారు. జానకి రామారావు భార్య ఇంకా ఇతర బంధువులు బోటు ప్రమాదంలో గల్లంతయ్యారు.

బోటు ప్రమాదం గురించి జానకి రామారావు మాట్లాడుతూ.. అందరం టిఫిన్‌ చేసి బోటు ఎక్కాము. ప్రయాణం అంతా బాగానే జరుగుతుంది. మరికాసేపట్లో పాపికొండలు రాబోతున్నట్లుగా బోటు సిబ్బంది ప్రకటించారు. ఆ సమయంలో బోటు కాస్త కుదుపులకు గురవుతుంది అప్పుడు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు ఇది డేంజర్‌ జోన్‌ అంటూ అనౌన్స్‌ చేయడం జరిగింది. అనౌన్స్‌ చేసిన కొద్ది సేపటికే బోటు ఒక పక్కకు ఒరిగింది. దాంతో అటువైపు ఉన్న వారు అంతా కూడా ఒక్క వైపుకు వచ్చారు. జనాలంతా ఒకేవైపుకు రావడంతో బోటు తిరిగి యదాస్థితికి చేరుకోలేక పోయింది.

బోటు ఒక వైపుకు వంగడంతో పైన ఉన్న వారు అంతా కూడా కిందకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ సమయంలో నేను శవాసనం వేసి ఉండి పోయాను. అలాగే ఉండిపోవడం వల్ల నేను బయట పడ్డాను అంటూ జానకి రామారావు అన్నారు. చిన్న చిన్న గాయాలు మినహా అంతా బాగానే ఉన్నానని చెప్పిన ఆయన గల్లంతయిన ఆయన కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతున్నారు.