Begin typing your search above and press return to search.

చూసేటోళ్లు ఎక్కువ ఇచ్చేటోళ్లు తక్కువ?

By:  Tupaki Desk   |   17 Oct 2015 4:59 AM GMT
చూసేటోళ్లు ఎక్కువ ఇచ్చేటోళ్లు తక్కువ?
X
అమరావతి నిర్మాణంలో సీమాంధ్రులతో పాటు.. తెలుగువారంతా భాగస్వామ్యం కావాలన్న సదుద్దేశ్యంతో ఏపీ సర్కారు ‘‘నా ఇటుక.. నా అమరావతి పేరుతో ఒక వెబ్ సైట్ స్టార్ట్ చేయటం.. దాని ద్వారా.. ఇటుకను దానం చేసే అవకాశం ఇవ్వటం తెలిసిందే.

ఒక్కో ఇటుక రూ.10 విలువతో.. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని కల్పించారు. గురువారం మధ్యాహ్నం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా స్టార్ట్ అయిన ఈ వెబ్ సైట్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. శనివారం ఉదయానికి 15వేల మంది ఇటుకల్ని దానం చేశారు. ఇప్పటివరకూ దానం చేసిన ఇటుకల సంఖ్య 10 లక్షలు దాటింది.

గురువారం మధ్యాహ్నం మొదలైన ఈ వెబ్ సైట్ (http://amaravati.gov.in/index.aspx ) ద్వారా అమరావతికి ఇటుకల్ని దానం చేసేందుకు తెలుగు వారంతా విపరీతమైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. పూర్తి స్థాయి పారదర్శకతతో నిర్వహిస్తున్న ఈ వెబ్ సైట్ లో ఒక్క ఇటుక దానం చేసినా.. వారికి సంబంధించిన వివరాలు పూర్తిగా దర్శనం ఇచ్చిన వైనం బాగుంది.

అంతేకాదు.. భారీగా విరాళం ఇచ్చిన వారి ఫోటో ప్రముఖంగా కనిపించేలా తీసుకున్న వైనం ఆకర్షణీయంగా ఉండటమే కాదు.. విరాళం ఇవ్వాలన్న ఆసక్తి పెంచేలా చేస్తోంది. గత మూడు రోజులుగా చూస్తే ఏపీ క్రెడా (ఏపీ సీఆర్ డీఏ) విరాళంగా ఇచ్చిన 52,200 ఇటుకల్ని ఇప్పటివరకూ ఎవరూ క్రాస్ చేయలేదు. క్రెడా తర్వాతి స్థానంలో ఆలూరు శివరామ ప్రసాద్ అనే వ్యక్తి 10,116 ఇటుకల్ని విరాళంగా ఇచ్చారు. తర్వాతి స్థానంలో గిరిధర్ అనంత 6000 ఇటుకల్ని విరాళం ఇవ్వగా.. ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర పేరిట 5,558 ఇటుకల్ని విరాళంగా ఇచ్చారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వెబ్ సైట్ స్టార్ట్ చేసిన సమయం నుంచి ఇప్పటివరకూ విరాళం ఇచ్చిన వారిని చూస్తే.. ఏపీ.. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు మాత్రమే కాదు పలువురు విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు ఇటుకల్ని విరాళంగా ఇచ్చిన వైనం కనిపిస్తుంది. ఉదయం.. మధ్యాహ్నం.. సాయంత్రం.. రాత్రి.. అర్థరాత్రి.. తెల్లవారు జామున అన్న తేడా లేకుండా ప్రతి సమయంలోనూ విరాళం ఇచ్చేందుకు ఆసక్తి ప్రదర్శించిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది. విరాళం చేసిన వారి వివరాల్ని పూర్తి స్థాయిలో గమనిస్తే.. అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జాము 5 గంటల సమయంలోనూ ఎక్కడా విరాళాల వర్షం ఆగలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది.

అన్నీ బాగానే ఉన్నా ఒక్క విషయంలో మాత్రం లోటు కనిపిస్తుందని చెప్పాలి. వెబ్ సైట్ చూస్తున్న వారి సంఖ్యకు విరాళం ఇస్తున్న వారి సంఖ్యకు పొంతన ఉండని పరిస్థితి. శనివారం ఉదయం నాటికే చూస్తే.. దాదాపు 5లక్షల మంది వెబ్ సైట్ ను చూస్తే.. విరాళం ఇచ్చిన వారు మాత్రం 15 వేల మంది మాత్రమే ఉండటం గమనార్హం. అంటే సైట్ ను చూస్తున్న వారిలో స్పందించి విరాళం ఇస్తున్న వారి శాతం కేవలం 3 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. సైట్ చూసే ప్రతి ఒక్కరూ ఒక ఇటుక విరాళం ఇచ్చినా చాలా బాగుంటుందన్న భావనను పలువురు సీమాంధ్రులు వ్యక్తం చేస్తున్నారు.