Begin typing your search above and press return to search.

రిజ‌ర్వేష‌న్ ప్రాథ‌మిక హ‌క్కుకాదు ...సుప్రీం కీలక తీర్పు !

By:  Tupaki Desk   |   12 Jun 2020 7:00 AM GMT
రిజ‌ర్వేష‌న్ ప్రాథ‌మిక హ‌క్కుకాదు ...సుప్రీం కీలక తీర్పు !
X
రిజర్వేషన్ల ‌పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్ట్ సంచ‌ల‌న తీర్పు వెల్లడించింది. రిజ‌ర్వేష‌న్ పౌరుల ప్రాథ‌మిక హ‌క్కుకాదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం లోని ఆర్టిక‌ల్ 32 కింద దీన్ని స‌వాల్ చేయ‌లేర‌ని కూడా సుప్రీం తేల్చిచెప్పింది. ఈ కీల‌క తీర్పుపై దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అసలు ఈ కేసు వివరాలని ఒకసారి పూర్తిగా చూస్తే ...

2020-21కి సంబంధించి గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వైద్య, దంతవైద్య కోర్సులను నీట్‌ ద్వారా భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆలిండియా కోటాలో తమిళనాడుకు సంబంధించిన సీట్లను సగం మేర ఓబీసీలకే కేటాయించాలని ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ విషయంలో త‌మిళ‌నాడులో రాజ‌కీయాల‌కు అతీతంగా అన్ని పార్టీలు ఏక‌మ‌య్యాయి. ఆ రాష్ట్రంలోని అన్నాడీఎంకే, డీఎంకే, సీపీఎం, సీపీఐ, తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ న్యాయం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

ఈ అంశంలో కేంద్ర ఆరోగ్యశాఖ, భారత వైద్య మండలి, జాతీయ పరీక్షల మండలిని ప్రతివాదులుగా చేరుతూ త‌మిళ‌నాడు నేతలు వైకో, అన్బుమణి రాందాస్‌ లు కూడా పిటిష‌న్‌ లు దాఖలు చేసారు. ఈ పిటిషన్ పై జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సంద‌ర్భంగా రిజ‌ర్వేష‌న్‌ పై సుప్రీం కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. రిజర్వేషన్‌ ప్రాథమిక హక్కు కాదు అని, రాజ్యంగంలోని ఆర్టికల్‌ 32 కింద దీనిని సవాలు చేయలేరు అని తెలిపింది.

సుప్రీం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశం మొత్తం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ఎందుకంటే రాజ‌కీయ పార్టీలు, త‌మ రాజ‌కీయ స్వార్థం కోసం రిజ‌ర్వేష‌న్ల‌ను అస్త్రాలుగా వాడుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ అంశంపై మద్రాస్‌ హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతిస్తూ, పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది.