Begin typing your search above and press return to search.

అపోలో వ‌ల్లే అమ్మ‌ను విదేశాల‌కు తీసుకెళ్ల‌లేద‌ట‌!

By:  Tupaki Desk   |   27 Sep 2018 5:50 AM GMT
అపోలో వ‌ల్లే అమ్మ‌ను విదేశాల‌కు తీసుకెళ్ల‌లేద‌ట‌!
X
ప‌లు సందేహాలున్న అమ్మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై మ‌రిన్ని అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యేలా మాట్లాడారు త‌మిళ‌నాడు ఉప ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం. తాజాగా ఆయ‌న అపోలో ఆసుప‌త్రుల మీద సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అనారోగ్యంతో అపోలో ఆసుప‌త్రిలో చేరిన అమ్మ‌.. అనంత‌రం నెల‌ల త‌ర‌బ‌డి అదే ఆసుప‌త్రిలో చికిత్స పొంద‌టం.. ఆ త‌ర్వాత ఆమె ఆరోగ్యం విష‌మంగా మార‌టం.. ఆపై మ‌ర‌ణించ‌టం తెలిసిందే.

అపోలో ఆసుప‌త్రిలో అమ్మ‌కు చికిత్స చేస్తున్న వేళ‌.. ఎవ‌రినీ లోప‌ల‌కు అనుమ‌తించ‌క‌పోవ‌టం.. వైద్యంపై ప‌లు సందేహాలు వ్య‌క్తం కావ‌టం లాంటివి చోటు చేసుకున్నాయి. అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత వెల్లువెత్తిన అనుమానాల నేప‌థ్యంలో విచార‌ణ క‌మిటీని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉంటే.. గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో ప‌న్నీర్ సెల్వం అపోలో ఆసుప‌త్రుల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ప‌న్నీర్ సెల్వం 2016లో అపోలో ఆసుప‌త్రిలో అమ్మ ఆరోగ్యం మెరుగు ప‌డింద‌ని.. దీంతో విదేశాల‌కు తీసుకెళ్లాల‌ని తాను అపోలో వైద్యుల్ని కోరిన‌ట్లుగా వెల్ల‌డించారు. అయితే.. త‌న మాట‌ల్ని అపోలో వైద్యులు ప‌ట్టించుకోలేద‌న్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున అమ్మ‌ను అమెరికాకు తీసుకెళ‌తామ‌ని అపోలో యాజ‌మాన్యానికి చెప్పినా వారు ఊరుకోలేద‌ని.. త‌మ వైద్యుల మీద న‌మ్మ‌కం లేదా? అని ప్ర‌శ్నించి అడ్డుకున్నార‌న్నారు. అమ్మ మ‌ర‌ణానికి కార‌ణం ప‌న్నీర్ సెల్వ‌మేన‌ని దిన‌క‌ర‌న్ వ‌ర్గానికి చెందిన నేత ఆరోపించిన‌నేప‌థ్యంలో ప‌న్నీర్ తాజా వ్యాఖ్య‌లు చేశారు. సందేహం క‌లిగించే అంశం ఏమంటే.. ఒక రాష్ట్ర ప్ర‌భుత్వాధినేత‌ను.. ఒక ప్రైవేటు ఆసుప‌త్రి యాజ‌మాన్యం కంట్రోల్ చేయ‌గ‌లదా? ప్ర‌భుత్వాధినేత కోరిన త‌ర్వాత అంగీక‌రించ‌కుండా ఉండ‌టం.. ఒప్పించే ప్ర‌య‌త్నం చేస్తుందా? అస‌లు అలాంటి ప‌ని చేయాల్సిన ప‌ని అపోలోకు ఎందుకు వ‌చ్చింద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. దీనిపై మ‌రింత క్లారిటీ రావాలంటే అపోలోనే ఆన్స‌ర్ చేయాల్సి ఉంటుంది.