Begin typing your search above and press return to search.

కేకపుట్టిస్తున్న రిలయన్స్ ప్రివ్యూ ఆఫర్!

By:  Tupaki Desk   |   20 Aug 2016 4:26 AM GMT
కేకపుట్టిస్తున్న రిలయన్స్ ప్రివ్యూ ఆఫర్!
X
అదేపనిగా ఫోను బిల్లులు కట్టలేకపోతున్నారా? అస్తమానం రీచార్జ్ చేయించుకోలేక ఇబ్బందిపడుతున్నారా? అయితే తాజాగా విడుదలయిన ఒక ఆఫర్ మీకోసమే.. ఈ విషయం తెలిసితే ఎగిరి గంతేయడమే కాకుండా.. వెంటనే స్టోర్లకు పరుగెడతారనండంలో సందేహం లేదు! ఇంతకూ ఈ స్థాయిలో ఊరిస్తున్న అంశం ఏమిటంటే.. రిలయన్స్ జియో ప్రివ్యూ ఆఫర్. మీదగ్గర 4జీ స్మార్ట్‌ ఫోన్ ఉంటే చాలు అన్‌ లిమిటెడ్ డేటా - అన్ లిమిటెడ్ కాల్స్ ఎంజాయ్ చేసెయ్యడమే. వినడానికేమాత్రం నమ్మశక్యంగా అనిపించకపోయినా.. ఇది వాస్తవమే!

టెలికం మార్కెట్లో పెను సంచలనానికి రిలయన్స్ జియో తెరతీసింది. ఈ పెనుసంచలనానికి కారణం 90 రోజులపాటు అన్ లిమిటెడ్ డేటా - కాల్స్ అందుబాటులోకి రావడమే. ఇప్పటి వరకు కొందరికే పరిమితమైన జియో ప్రివ్యూ ఆఫర్ ఇక నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. 4జీ ఫోను ఉంటేచాలు.. ఎవరైనా జియో సిమ్‌ ను ఉచితంగా తీసుకోవచ్చు. అనంతరం 90 రోజులపాటు అపరిమితంగా - ఉచితంగా జియో సేవలను పొందవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ అందుబాటులోకి వచ్చిన ఈ సేవలు - టెలీకాం రంగంలో పెను సంచనాలు తీసుకురాబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో వాణిజ్యపర కార్యకలాపాలను ఇంకా ప్రకటించకముందే తీసుకున్న ఈ తాజా నిర్ణయం టెలికం మార్కెట్‌ను షేక్ చేయనుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఆరు నెలల క్రితమే రిలయన్స్ జియో ఈ ప్రివ్యూ ఆఫర్‌ ను ప్రారంభించినప్పటికీ.. తొలుత రిలయన్స్ ఉద్యోగులు, వారి బంధువులకు మాత్రమే దీనిని అమలు చేసింది. ఆ తర్వాత లైఫ్ స్మార్ట్‌ ఫోన్ కొన్న కస్టమర్లకు 90 రోజులపాటు ఈ ప్రివ్యూ ఆఫర్‌ ను ప్రకటించింది. అనంతరం కొంతకాలానికి లైఫ్ బ్రాండ్ స్మార్ట్‌ ఫోన్ కొనుక్కోకపోయినా కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులందరికీ ప్రివ్యూ ఆఫర్‌ ను అమలు చేస్తోంది. దీనిని శామ్‌ సంగ్ - హెచ్‌ పీ వినియోగదార్లకు విస్తరింపచేసింది. అయితే తాజాగా ఏ కంపెనీ 4జీ స్మార్ట్‌ ఫోన్ అయినా సరే.. ప్రతి ఒక్క కస్టమర్‌ కు ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. సమీపంలోని రిలయన్స్ డిజిటల్ లేదా అధీకృత స్టోర్‌ ను సంప్రదించి కస్టమర్లు ఈ ఉచిత సిమ్‌ ను పొందవచ్చని తెలిపింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఇప్పటికే ఉన్న జియో కస్టమర్స్ సగటున రోజుకు 1 జీబీ డేటాను వినియోగిస్తున్నారట. మార్కెట్‌ లో ఉన్న టెలికం కంపెనీల డేటా ధరలను పరిగణలోకి తీసుకుంటే ఒక్కో జీబీకి సరాసరిన రూ.200 అవుతుందను కుంటే 30 రోజులకు రూ.6 వేలు చెప్పున 90 రోజులంటే రూ.18 వేలు. అంటే.. ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటా ల వివరాలు కలిపి మొత్తంగా ఈ ప్రివ్యూ ఆఫర్ కింద ఒక్కో కస్టమర్ రూ.20 వేల విలువ చేసే ప్యాకేజీని ఫ్రీగా ఎంజాయ్ చేస్తారన్న మాట. కాగా.. టెలికం ఆపరేటర్లు తమ ట్రయల్ సర్వీసులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని జియో అందోళన వ్యక్తం చేస్తోంది. ఈ విషయమై పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ, టెలికం శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్‌ తో సమావేశమయ్యి ఈ మేరకు విషయం చెప్పారట