Begin typing your search above and press return to search.

పుట్టిన ప్రాంతానికి ఒట్టి చేత‌లు! జ‌గ‌న్‌పై రెడ్డి నేత‌ల టాక్‌

By:  Tupaki Desk   |   15 April 2022 8:52 AM GMT
పుట్టిన ప్రాంతానికి ఒట్టి చేత‌లు! జ‌గ‌న్‌పై రెడ్డి నేత‌ల టాక్‌
X
"సీమ‌పై ప్రేమేది సారూ. నేను పుట్టిన సీమ‌పై ప్రేమ ఉందంటావ్‌.. కానీ, చేత‌ల్లోకి వ‌చ్చేస‌రికి రిక్త హ‌స్తాలు చూపిస్తున్నావ్‌" అంటూ.. సీమ ప్రాంత రెడ్డి సామాజిక వ‌ర్గం ఫైర‌వుతోంది. తాజాగా జ‌రిగిన జ‌గ‌న్ కేబినెట్ 2.0 కూర్పులో రెడ్డి సామాజికవర్గానికి సీఎం జ‌గ‌న్ ప్రాధాన్యం త‌గ్గించేశారు. ఎక్క‌డ రెడ్డి ముద్ర ప‌డుతుంద‌ని అనుకున్నారో.. ఇలా నిర్ణ‌యం తీసుకున్నారు. అదే పార్టీకి, ప్ర‌భుత్వానికి కూడా ఆయువు ప‌ట్టు వంటి రెడ్డి సామాజిక వ‌ర్గం మాత్రం తీవ్ర‌స్థాయిలో ఆందోళ‌న‌వ్య‌క్తం చేస్తోంది.

ముఖ్యంగా అనంత‌పురంలోరెడ్డి సామాజికవ‌ర్గం డామినేష‌న్ ఎక్కువ. ఇక‌, జిల్లాల పునర్విభజన అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లాను రెండుగా విభజించినా, అటు శ్రీసత్యసాయి జిల్లాలోను, ఇటు అనంతలోనూ ఏ ఒక్క రెడ్డి ఎమ్మెల్యేకీ మంత్రి పదవి దక్కలేదు. తాజా కేబినేట్‌లోనైనా అవకాశం ఉంటుందని భావించిన రెడ్డి వ‌ర్గం ఎమ్మెల్యేలకు తీవ్ర నిరాశ ఎదురైంది. వారి ఆశలు ఆవిరయ్యేలా ముఖ్యమంత్రి నిర్ణయం వెలువడింది. దీంతో ఆ సామాజికవర్గం ఎమ్మెల్యేలను తీవ్ర నిరాశా నిస్పృహల్లోకి వెళ్లిపోయారు. మంత్రి పదవి ఆశించి దక్కకపోవడంతో, ఆశావహ ఎమ్మెల్యేలు తీవ్ర నిర్వేదంలోకి వెళ్లారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అత్యంత కీల‌క‌మైన రెడ్డి సామాజికవర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం పట్ల ఆ సామాజిక వర్గం శ్రేణులు సైతం తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నాయి. ఈ అసంతృప్తి సెగలు పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అన్న చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతోంది. ఇక‌, మంత్రి పదవిని ఆశించిన రెడ్డివ‌ర్గం లోలోన చాలా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. పునర్వ్యవస్థీకరణలో తప్పనిసరిగా రెడ్డి సామాజికవర్గానికి చోటు కల్పిస్తారని కొందరు ఎమ్మెల్యేలు ధీమాగా ఉన్నారు. మంత్రి పదవిని ఆశించిన రెడ్లలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, అనంతపురం అర్బన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఉన్నారు.

దీంతో వారి అనుచ‌రులు తమ ఎమ్మెల్యేకే మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో భారీ స్వాగత సన్నాహాల్లో తలమునకలయ్యారు. రాష్ట్రంలో ఏ మంత్రికీ ఇదివరకు లభించనంత ఘనంగా స్వాగతం పలకాలని అనుచర వర్గం వ్యూహం రచించుకుంది. వందలాది వాహనాలతో స్వాగతం పలికేందుకు రంగం సిద్ధం చేసుకుంది. స్వాగత ఏర్పాట్లల్లో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అనుచరవర్గం అత్యుత్సాహంలో ముందుకుపోయింది, ఇక‌, పార్టీ సీనియర్‌ నాయకుడు, వివాదరహితుడైన అనంతపురం అర్బన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి మంత్రి పదవి ఖాయమని పార్టీ శ్రేణుల్లో మెజార్టీ వర్గం భావించింది.

ఈ క్రమంలో ఆయన వర్గీయులు కూడా గుట్టుగా స్వాగత ఏర్పాట్లు చేసుకున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వర్గీయులు కూడా స్వాగత ఏర్పాట్లు చేసుకున్నారు. మ‌రోవైపు ఎస్సీ సామాజికవర్గం కోటాలో శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి మంత్రి పదవి ఖాయమని ఆ నియోకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశల్లో తేలిపోయారు. ముఖ్యమంత్రి జగనతో ఎమ్మెల్యే భర్త, రాష్ట్ర పాఠశాల విద్యానియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డికి ఉన్న సాన్నిహిత్యం కారణంగా పద్మావతికి మంత్రివర్గంలో చోటు లభిస్తుందని భావించారు.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అనుచరవర్గం భారీ స్వాగత ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. సీఎం జగన్‌ మొండిచేయి చూపడంతో ఆశావహులు, వారి అనుచరులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. సొంత సామాజికవర్గానికి ఇలా చేయడం పట్ల సీఎం జగనపై అటు నాయకులు, ఇటు కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో వీరు ఏం చేస్తారో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్పుడు ఎవ‌రిని క‌దిపినా.. ఆగ్ర‌హంతో ర‌గిలిపోతుండ‌డం గ‌మ‌నార్హం.