Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ లో తిరుగుబాటు..!

By:  Tupaki Desk   |   11 Jan 2020 9:30 AM GMT
టీఆర్ఎస్ లో తిరుగుబాటు..!
X
తెలంగాణ రాష్ట్ర సమితి కే బాస్.. రాష్ట్రానికే డిక్టేటర్ సీఎం కేసీఆర్ చెప్పినా గులాబీ శ్రేణులు డోంట్ కేర్ అనేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. అయితే కేసీఆర్ రెబల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పినా నేతలు ఆయనను పట్టించుకో లేదు. గులాబీ పార్టీ బీఫాంలు ఇవ్వకున్నా.. సపోర్టు చేయకున్నా.. ఒక్కో వార్డులో కనీసం ముగ్గురు నుంచి ఆరుగురు వరకు టీఆర్ఎస్ పార్టీ వారే పోటీ లో నిలిచారు.

దీంతో ఈ వ్యవహారం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు అతలాకుతలం చేస్తోంది. ఎంత బుజ్జగింపులు చేస్తున్నా.. ప్రలోభ పెడుతున్నా నేతలు పోటీ నుంచి విరమించుకోవడానికి ససేమిరా అంటుండడంతో మంత్రులు, ఎమ్మెల్యేల గుండెల్లో ‘రెబల్స్’ మోత మోగుతోంది.

టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలైంది. మున్సిపాలిటీ బరి లో టీఆర్ఎస్ నేతలంతా దిగడంతో గులాబీ అధిష్టానానికి చెమటలు పడుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు 14వరకు గడువు ఉంది. ఆ లోగా ఉపసంహరించేలా చేయాలని చెప్పినా నేతలు వెనక్కి తగ్గడం లేదు. ఈ పరిణామం గులాబీ పార్టీ పుట్టి ముంచుతుందన్న ఆందోళన నెలకొంది.

తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధికార టీఆర్ఎస్ పార్టీ తరుఫున ఇబ్బడిముబ్బడిగా రెబల్స్ నామినేషన్ వేశారు.ఆది నుంచి జెండా మోసిన వారు.. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నుంచి వచ్చి గులాబీ పార్టీలో చేరిన వారు అంతా పోటీకి దిగడంతో గులాబీ పార్టీలో కలవరం మొదలైంది. ఒక్క జగిత్యాలలోనే 191మంది టీఆర్ఎస్ నేతలు నామినేషన్ వేయడం సంచలనంగా మారింది. వార్డుకు 8 నుంచి 9మంది పోటీకి దిగారు. తెలంగాణ వ్యాప్తం గా ఇదే పరిస్థితి. ఈ పరిణామం గులాబీ పార్టీ పుట్టి ముంచుతున్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

కేసీఆర్ చెప్పినా నేతలు వినకుండా తిరుగుబాటు చేసిన వైనం టీఆర్ఎస్ పార్టీ లో కలకలం రేపుతోంది. ఇది గులాబీ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో నష్టం తెస్తుందని అంటున్నారు.