Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్: నిర‌స‌న‌ల ద‌డ‌..బౌన్స‌ర్ల అండ‌

By:  Tupaki Desk   |   11 Nov 2018 6:57 AM GMT
టీ కాంగ్రెస్: నిర‌స‌న‌ల ద‌డ‌..బౌన్స‌ర్ల అండ‌
X
తెలంగాణ కాంగ్రెస్ అనూహ్య ప్ర‌తిఘ‌ట‌న‌ల‌ను ముంద‌స్తు ఎన్నిక‌ల రూపంలో ఎదుర్కుంటోంది. అప‌ద్ద‌ర్మ స‌ర్కారుకు సార‌థ్యం వ‌హిస్తున్న అధికార పార్టీని మట్టి కరిపించేందుకు కాంగ్రెస్ పార్టీ సీపీఐ - టీడీపీ - టీజేఎస్‌ తో జ‌ట్టుక‌ట్టి కూటమి రూపంలో ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రంలో తమ ప్రత్యర్థి అధికార టీఆర్‌ ఎస్‌ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తుంటే కాంగ్రెస్‌ మాత్రం ఇంకా ఎంపిక వద్దే ఉండటం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. స్క్రీనింగ్‌ కమిటీ పలు దఫాలుగా చర్చలు జరిపినా టిక్కెట్లు పంపిణీ ఇంకా చేయలేదు. సీట్ల ప్రకటనపై కాంగ్రెస్‌ అధిష్టానం ఇంకా వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నప్ప‌టికీ - ఆ పార్టీ కార్యాల‌యం వ‌ద్ద ఆందోళ‌న‌లు మిన్నంటుతున్నాయి. ఇప్పటికే రెబెల్స్‌ స్క్రీనింగ్‌ కమిటీతో నిత్యం భేటీ అవుతుతున్నారు. తమ కు టిక్కెట్‌ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కొంతమంది హెచ్చరిస్తున్నారు. కాగా, మరి కొంతమంది మాత్రం తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని విన్నవించుకుంటున్నారు. సీటు దక్కని నేతలు...తమ అనుచరగణాన్ని వెంటేసుకుని దండయాత్రలకు దిగుతున్నారు. ఓ వైపు నిరసన దీక్షలు..మరోవైపు ఆమరణదీక్షలు..ఇంకోవైపు ఆత్మహత్యాయత్నాలతో గాంధీభవన్‌ వద్ద సీన్‌ హీటెక్కిస్తున్నది. గాంధీభ‌వ‌న్ వ‌ద్ద బౌన్స‌ర్ల‌తో ర‌క్ష‌ణ క‌ల్పిస్తుండ‌టం ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంది.

పొత్తుల వ‌ల్ల సీట్లు కోల్పోతుండటంతో నేత‌లు తీవ్రంగా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పొత్తుల్లో భాగంగా ఉప్పల్‌ నియోజకర్గం టీడీపీకి కేటాయిస్తున్నట్టు పార్టీ వర్గాలు అనేక దఫాలుగా చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి ఇచ్చిన జాబితాల్లోనూ ఉప్పల్‌ ఉన్నది. దీనిపై రేపో - మాపో ప్రకటన వచ్చే అవకాశం ఉన్నది. అయినప్పటికీ ఆ స్థానాన్ని టీడీపీకి ఇవ్వొద్దంటూ స్థానిక నేత రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్యర్యంలో వందలాది మంది వచ్చి హడావుడి చేశారు. ఆయన అనుచరుడు ఒంటిపై కిరోసిన్‌ పోసుకునే ప్రయత్నం చేయడంతో కార్యకర్తలు వారించారు. పార్టీ సీనియర్‌ నేత కోదండరెడ్డి జోక్యం చేసుకుని అధిష్టానం దృష్టికి తీసుకుపోతానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కాంగ్రెస్‌ పార్టీకి బలమైన కేంద్రంగా ఉన్న మల్కాజిగిరి నియోజకవర్గాన్ని టీజేఎస్‌ కు కేటాయించొద్దంటూ కాంగ్రెస్ పార్టీ నేత నందికంటి శ్రీధర్‌ అనుచరులు ధర్నా చేపట్టారు. మూతులకు నల్ల రిబ్బన్‌ కట్టుకుని మౌనదీక్ష చేపట్టారు. తెలంగాణ జన సమితికి అక్కడ బలంలేదని - స్థానికేతరుడైన కంపిలవాయి దిలీప్‌ కుమార్‌ కు కేటాయించడం సముచితం కాదని వారు చెప్పారు.

మ‌రోవైపు రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి ఆందోళ‌న‌లు గాంధీభ‌వ‌న్ కేంద్రంగా సాగుతున్నాయి. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన ఖానాపూర్‌ ను పారాచూట్లకు ఇవ్వొదంటూ ఐదు మండలాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు అమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ లో చేరిన మాజీ ఎంపీ రామేష్‌ రాథోడ్‌ కు టికెట్‌ హామీ ఇవ్వడంతో నియోజకవర్గం ఇన్‌ చార్జి ఆజ్మీరాలాల్‌ నాయక్‌ వర్గీయులు దీక్షకు పూనుకున్నారు. దీక్ష చేస్తున్న వారిలో రియాజుద్దీన్‌ - దయానంద్‌ - వెంకటేష్‌ - నర్సయ్య - నాగోరావు ఉన్నారు. రాథోడ్‌ అభ్యర్థిత్వాన్ని మండలాల అధ్యక్షులు - మాజీ సర్పంచులు - ఎంపీటీసీలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు హామీ వచ్చేవరకు అమరణ దీక్ష కొనసాగిస్తామని చెబుతున్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన నకిరేకల్‌ లో కాంగ్రెస్‌ పార్టీ చిచ్చు పెట్టింది. ఆ సీటును ఆశిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ అనుచరుడు - మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు టికెట్‌ వస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ ఆ సీటు పొత్తుల్లో భాగంగా ఇంటి పార్టీ నాయకురాలు చెరుకు లక్ష్మికి ఇవ్వనున్నట్టు వార్తలొచ్చాయి. దీనిపై కోమటిరెడ్డి బ్రదర్స్‌ వెంకట్‌ రెడ్డి - రాజగోపాల్‌ రెడ్డి పార్టీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - సీఎల్పీ మాజీ నేత కె జానారెడ్డిపై తీవ్ర మైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా నకిరేకల్‌ పార్టీ నేత ప్రసన్నరాజు ఆధ్వర్యంలో గాంధీభవన్‌ లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రసన్నరాజు మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రదర్స్‌ పై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నకిరేకల్‌ చిరుమర్తి లింగయ్యకు ఇవ్వొద్దని - తనకే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాగా, అభ్య‌ర్థుల‌ ప్ర‌క‌ట‌న‌కు ముందే ఇలాంటి ప‌రిస్థితి ఉంటే - ప్ర‌క‌ట‌న త‌ర్వాత ఎలా ఉంటుందోన‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.