Begin typing your search above and press return to search.

వంశీ ఇవేం పిరికి రాజ‌కీయాలు...?

By:  Tupaki Desk   |   28 Oct 2019 2:30 PM GMT
వంశీ ఇవేం పిరికి రాజ‌కీయాలు...?
X
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రాజకీయ దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో వంశీ ఒకరు. అలాంటి వంశీ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాలుగు నెలలకే యూ టర్న్ తీసుకొని రాజకీయ వేధింపులు తట్టుకోలేక పోతున్నానని... అందుకే పార్టీలో ఉండలేనంటూ రాజీనామా చేయటం టిడిపి వర్గాలకే కాదు మిగిలిన రాజకీయ పక్షాలు సైతం పెద్ద షాక్ ఇచ్చింది. దీనిపై ఎవరికివారు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కొంత మంది రాజకీయ నాయకులు అధికారం అనే అండలేకపోతే ఉండలేరు.

ఇందుకు ఏపీలో తాజా మాజీమంత్రి పెద్ద ఉదాహరణ. ఆయన అధికారం ఎక్కడ ఉంటే అక్కడే వాలిపోతారు అన్న టాక్ ఉంది. ఇక వంశీ విషయానికి వస్తే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీ చేసినప్ప‌టి నుంచి రాజకీయంగా సతమతమవుతూనే ఉన్నారు. ఎన్నికల టైంలోనే త‌న‌ను ఎన్నికల్లో పోటీ చేయవద్దని బెదిరింపులు వస్తున్నాయని.. ఎన్నికల్లో పోటీ చేయాలా ? వద్దా అన్నది తేల్చుకోలేక పోతున్నాను.. అని తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని వంశీ సైతం ఓపెన్ గా నే చెప్పారు.

ఆ టైంలో ఏ నేత అయినా భ‌య‌ప‌డినా ఆ విష‌యం చెప్ప‌లేరు. వంశీ కూడా తనకు బెదిరింపు వస్తున్న మాట వాస్తవమే.. అని తాను మాత్రం పోటీ చేసి తీరుతాను అని చెప్పారు. అలాంటి నేత ఎమ్మెల్యేగా ఉండి పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన నాలుగు నెలలకే అనూహ్యంగా యూటర్న్ తీసుకుని తనకు రాజకీయాలు వద్దని చెప్పడాన్ని బట్టి చూస్తే వంశీ పైకి బలమైన నేతగా కనిపించినా... లోపల పిరికివాడు అన్న చర్చలు కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసిన వంశీ వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఇంటికి వెళ్లి నువ్వు గెలిస్తే సన్మానం చేస్తా.. అని చాలా అతిగా ప్రవర్తించిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు.

అంటే ఎన్నికల్లో తాను గెలవడంతో పాటు తిరిగి టిడిపి అధికారంలోకి వస్తుందన్న ధీమాతో నే వంశీ అప్పట్లో అలా ప్రవర్తించి ఉండవచ్చు. అలాంటిది పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో ఇప్పుడు సడన్ గా చాలా పిరికితనంతో వ్యవహరిస్తున్నట్టు... ఏకంగా రాజకీయాల వదిలేస్తాను.. అని చెప్పటం విచిత్రంగా ఉంది. వాస్తవంగా వంశీకి ఆంధ్రప్రదేశ్ లోనూ అటు తెలంగాణలోనూ వివాదాస్పద ఆస్తులు ఉన్నాయి. ఇక నకిలీ పట్టాలు వివాదం ఉంది. దీనికితోడు మనోడిపై చాలా కేసులు కూడా ఉన్నాయి. ఇక తాజాగా న‌కిలీ ప‌ట్టాల వివాదం తెరమీదకు వచ్చింది. అటు ఆస్తులు కాపాడుకోవాలి... ఇటు కేసులు ఎదుర్కోవాలి అధికారం కావాలి ..ఇవన్నీ టిడిపిలో ఉండి ఎదుర్కొనే సత్తా తనకు లేదన్న విషయం వంశీకి అర్థం అయినట్లు ఉంది.. అందుకే ఇప్పుడు వైసిపి అండ కావాలి.

ఈ క్రమంలోనే వైసిపి మంత్రి కొడాలి నాని లాంటి వాళ్లతో తనకున్న పరిచయాలను బయటికి తీసి ఇప్పుడు సరికొత్తగా గేమ్ ఆడుతున్నట్టు పలువురు అనుమానిస్తున్నారు. రాజకీయ నాయకులు అన్నాక అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా ప్రత్యర్థుల నుంచి విమర్శలు సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి వ్యక్తి తనకు తానే ఫైటింగ్ చేయకపోతే... ఇప్పుడు పార్టీ మారినా రేపు మళ్లీ ఇబ్బందులు వచ్చినప్పుడు మళ్లీ ప్లేటు ఫిరాయించ‌ర‌న్న‌ గ్యారంటీ ఏం ఉంటుంది.