Begin typing your search above and press return to search.

మోడీ, షరీఫ్ దోస్తీ నచ్చకే దాడి

By:  Tupaki Desk   |   2 Jan 2016 9:22 AM GMT
మోడీ, షరీఫ్ దోస్తీ నచ్చకే దాడి
X
భారత్ - పాక్ ల మధ్య చిగురిస్తున్న స్నేహాన్ని మొగ్గలోనే తుంచేసేందుకు ఉగ్రవాద సంస్థలు కంకణం కట్టుకుంటున్నాయి. భారత్, పాక్ ప్రధానుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడి చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో భారత్ లో దాడులకు తెరతీసి రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు ఉగ్రవాద సంస్థలు రంగంలోకి దిగాయి. పటాన్ కోట్ లో దాడి అందుకు ఉదాహరణ. ముంబయి ఉగ్రదాడుల తరువాత చాలాకాలం పాటు భారత్, పాక్ ల మధ్య చర్చలకు అవకాశం లేకుండాపోయింది. నిత్యం సరిహద్దుల్లో కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో భారత ప్రధానిగా మోడీ ఫుల్ మెజారిటీతో పీఠం ఎక్కిన తరువాత పరిస్థితులు మారాయి. ఆయన పొరుగు దేశంలో స్నేహం కోరుకుంటున్నానన్న సంకేతాలను బలంగా పంపించారు. తన ప్రమాణ స్వీకారానికి పాక్ అధ్యక్షుడిని పిలిచి గౌరవించారు. ఆ తరువాత అది కొనసాగుతూ వచ్చింది.

మొన్న ప్యారిస్ లో వాతావరణ సదస్సులో ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకుని మాట్లాడుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఇండియా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్ వెళ్లారు. అక్కడ రెండు రోజులు పర్యటించారు. రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు కూడా సమావేశమయ్యారు. వీటన్నిటినీ మించిపోయేలా మోడీ తన నిర్ణయంతో పాక్ నే కాదు ప్రపంచాన్నీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల రష్యా వెళ్లిన మోడీ అక్కడి నుంచి మార్గమధ్యంలో పాకిస్థాన్ లో దిగి ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేరోజు షరీఫ్ మనవరాలి పెళ్లి జరుగుతుండడంతో ఆమెకు కానుకలిచ్చారు. అంతేకాదు, షరీఫ్ కు కూడా విలువైన తలపాగా ఒకటి కానుకగా ఇచ్చారు. దాన్ని షరీఫ్ ఎంతో అపురూపంగా తన మనవరాలి పెళ్లిలో ధరించడం విశేషం. ఈ రకంగా మోడీ పాక్ తో భారత్ తరఫున స్నేహహస్తం అందించడమే కాకుండా వ్యక్తిగతంగానూ నవాజ్ షరీఫ్ ను ఆలోచనలో పడేశారు. వ్యక్తిగత మిత్రుడిలా షరీఫ్ కు కనిపించారు. దాంతో షరీఫ్ కూడా స్పందించి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఇక తమకు ఎంత మాత్రం శత్రువు కారాదని ఆయన అన్నారు. పాకిస్థాన్ ప్రధాని స్థాయి వ్యక్తి ఎవరూ గతంలో అలాంటి మాట అనే సాహసం చేయలేదు... భారత్ తో స్నేహాన్ని తాము కోరుకుంటున్నామని.. చర్చించుకుని అన్ని సమస్యలు పరిష్కరించుకుంటామని కూడా షరీఫ్ చెప్పారు. మొత్తానికి రెండు దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అదేసమయంలో ఉగ్రవాదులు మాత్రం ఈ రెండు దేశాలు కలిస్తే తమ మనుగడ ఉండదని భావిస్తూ ఈ మైత్రిని చెడగొట్టేందుకు తయారవుతున్నారు.

ఈ నెల 15న రెండు దేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశం ఉన్న సమయంలో ఈ దాడి జరగడం ఆ చర్చలపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ఉగ్రవాదుల లక్ష్యం కూడా అదేనంటున్నారు. అయితే... గతంలో ఉగ్రవాదుల ఉచ్చులో పడకుండా మోడీ, షరీఫ్ లు చర్చలపై ఆ ప్రభావం లేకుండా చూస్తారని... రెండు దేశాల మధ్య సరికొత్త సంబంధాలు ఏర్పడతాయని భావిస్తున్నారు.

షరీఫ్ కు ఉగ్రవాదమా... స్నేహహస్తమా తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని... ఆయన స్నేహం వైపే మొగ్గు చూపి ఉగ్రవాదుల అంతానికి భారత్ తో చేతులు కలుపుతారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.