Begin typing your search above and press return to search.

ఎయిర్ బేస్ నే ఎందుకు టార్గెట్ చేశారు?

By:  Tupaki Desk   |   3 Jan 2016 5:23 AM GMT
ఎయిర్ బేస్ నే ఎందుకు టార్గెట్ చేశారు?
X
సైనిక దుస్తుల్లో పటాన్ కోట్ ఎయిర్ బేస్ లోకి అక్రమంగా ప్రవేశించిన ఉగ్రవాదుల టార్గెట్ ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వ్యూహాత్మకంగానే పటాన్ కోట్ ఎయిర్ బేస్ ను టార్గెట్ చేశారన్న భావన కలుగుతోంది. పాక్ సరిహద్దుకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎయిర్ బేస్ భారత్ కు చాలా కీలకమైంది. ఈ కేంద్రంలో మిగ్ 21 యుద్ధ విమానాలు.. ఎంఐ 25 ఫైటర్ చాఫర్లు లాంటివి ఉంటాయి.

వీటిల్లో ఏ ఒక్కటిని ఉగ్రవాదులు చేజిక్కించుకున్నా పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంతలో కొంత ఉపశమనం కలిగించే అంశం ఏమిటంటే.. సైనిక దుస్తుల్లో ఎయిర్ బేస్ లోకి ప్రవేశించిన వెంటనే.. ఏరియల్ సర్వైలెన్స్ రాడార్లు అనుమానాస్పద వ్యక్తులు లోపలకు అడుగుపెట్టినట్లుగా చూపించాయి. ఇదే కనుక జరిగి ఉండని పక్షంతో పెను ప్రమాదం జరిగేది. ఎయిర్ బేస్ వెనుక వైపున ఉన్న అటవీ మార్గం నుంచి వచ్చిన తీవ్రవాదులు పెద్ద ప్రణాళికతోనే వచ్చారు. వారితోపాటు భారీ ఆర్డీఎక్స్ నిల్వలతో రావటం గమనార్హం. ఎయిర్ బేస్ లోకి ప్రవేశించిన వెంటనే భద్రతాదళాలు వారిని అడ్డుకోవటంతో పెను ముప్పు తృటిలో తప్పింది. మిగ్ 21 యుద్ధ విమానాలున్న స్థావరంలోకి వారు అడుగుపెట్టాలని విఫలయత్నం చేశారు.

మానిటర్లలో అక్రమంగా చొరబాటుదారులు ప్రవేశించారన్న హెచ్చరికతో ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. దీంతో.. భారీ నష్టం జరగలేదు. ఇక.. పటాన్ కోట్ ఎయిర్ బేస్ లోకి రావటానికి ఉగ్రవాదులు డిసెంబరు 30 అర్థరాత్రి దాటాక అంతర్జాతీయ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉన్న బమియాల్ గ్రామానికి చేరువలో సరిహద్దు దాటినట్లు భావిస్తున్నారు. అలా భారత భూభాగంలోకి ప్రవేశించిన వారు.. గురుద్వారాలో ప్రార్థనలు చేసుకొని వస్తున్న ఎస్పీ స్థాయి అధికారి సల్వీందర్ సింగ్ కారును సైనిక దుస్తుల్లో ఉన్న వారు ఆపి..దాడి చేసి కారును తీసుకెళ్లిపోయారు.

అనంతరం ఆ కారును పటాన్ కోట్ ఎయిర్ బేస్ కు 2 కిలోమీటర్ల దూరంలో విడిచిపెట్టారు. అక్కడ నుంచి నడక మార్గంలో ఎయిర్ బేస్ వెనుక ప్రాంతం నుంచి లోపలకు ప్రవేశించారు. అయితే.. ఎయిర్ బేస్ లోకి అడుగుపెట్టిన వెంటనే.. టెక్నాలజీ సాయంతో వీరిని గుర్తించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొన్ని గంటల పాటు ఉగ్రవాదులకు.. భద్రతా సిబ్బందికి మధ్య పరస్పర కాల్పులు జరిగిన ఆనంతరం మొత్తం నలుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. కాకుంటే.. ఈ ఆపరేషన్ లో ముగ్గురు అధికారులు మృతి చెందారు.