Begin typing your search above and press return to search.

దిశ హంతకుల ఎన్ కౌంటర్ కు కారణాలివేనా?

By:  Tupaki Desk   |   7 Dec 2019 9:41 AM GMT
దిశ హంతకుల ఎన్ కౌంటర్ కు కారణాలివేనా?
X
దిశ హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణ పోలీసుల పరువు తీసింది. సీఎం కేసీఆర్ ను వేలెత్తి చూపించింది. అయితే దిశను దారుణంగా అత్యాచారం చేసిన నిందితులు ఆ తర్వాత ఆమెను కాల్చిచంపారు. ఎక్కడా ఆధారాలు లేకుండా చేశారు. దేశవ్యాప్తంగా తెలంగాణ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిన కేసులో పోలీసులకు ఎలాంటి క్లూలు దొరకలేదని సమాచారం. అందుకే ఈ కేసుపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకే పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారన్న చర్చ ఇప్పుడు అంతటా సాగుతోంది.

దిశ అత్యాచారం హత్య కేసులో నిందితులే నేరం చేసినట్లుగా పోలీసులు నిరూపించడానికి తగిన ఆధారాలు లభించలేనట్లు తెలిసింది. కోర్టులో వీరి నేరం రుజువు చేయడం పోలీసులకు సాధ్యమయ్యే అవకాశం లేదని విచారణలో వెలుగుచూసినట్లు తెలిసింది. దీంతో వీరి ఆకృత్యాలకు ఎన్ కౌంటర్ తోనే ముగింపు పలకాలని తద్వారా తమపై పడ్డ చెడ్డ పేరును తుడుచుకోవాలనే పోలీసులు ఈ ప్లాన్ చేసి ఉండవచ్చని న్యాయ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దిశను అత్యాచారం చేసినప్పుడు.. హత్య చేసినప్పుడు, సజీవ దహనం చేసినప్పుడు కూడా ఈ నలుగురు తప్పితే ఏ ఒక్క ప్రత్యక్ష సాక్ష్యం పోలీసులకు దొరకలేదు. సీసీ టీవీ ఫుటేజీలల్లో కూడా నేర దృశ్యాలు లేవు. ఇక దిశను కాల్చేయడంతో డీఎన్ఏ పరీక్షలో కూడా ఆమె అని నిర్ధారించలేని పరిస్థితి. నిందితులు నేరం ఒప్పుకున్నా కోర్టులు వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోవు. ఆధారాలుంటేనే నమ్ముతాయి. బలమైన ఆధారాలు దొరకకపోవడంతోనే నేరం నిరూపించడానికి సాధ్యం కాని పరిస్థితి ఈ కేసులో ఉందట.. సాక్ష్యాల కోసం అన్ని విధాల ప్రయత్నించిన పోలీసులు దొరకకపోవడతో చివరకు నేరస్థులు తప్పించుకుంటే సమాజంలో పోలీసులపై మరింత విమర్శలు వస్తాయనే ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చనే చర్చ సాగుతోంది.

దిశను రేప్ చేసి చంపిన నిందితులు ఒక్క ఆధారం లేకుండా పక్కా ప్లాన్ తో చంపిన వైనం పోలీసులను కూడా నివ్వెరపరిచిందని సమాచారం. దిశను సజీవ దహనం చేసి ఏ ఆధారం బయటపడకుండా వీరు చేశారు. పక్కా క్రిమినల్స్ లాగా.. కరుడుగట్టిన నేరస్థుల వలే తెలివిగా ప్రవర్తించి పోలీసులకే చుక్కలు చూపారు. దిశ నిందితుల్లో ఒకరికి ఫోన్ చేయడం వల్లే వారు దొరికారు. లేదంటే ఈ కేసులో అస్సలు వీరిపై అనుమానం వచ్చి ఉండేదే కాదు.. అందుకే ఈ క్రూరంగా చంపి ఆధారాలు కనిపించకుండా చేసిన నలుగురు రేపిస్టులపై పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.