Begin typing your search above and press return to search.

పుష్కరాల‌కు బీజేపీ దూరం ఇందుకే....

By:  Tupaki Desk   |   27 July 2015 3:57 AM GMT
పుష్కరాల‌కు బీజేపీ దూరం ఇందుకే....
X
ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి పుష్కరాలకు మూడు నుంచి నాలుగు కోట్ల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేసినప్పుడు అంతా నివ్వెరపోయారు. కానీ ఊహించినదానికంటే ఎక్కువగానే యాత్రికులు వచ్చారు. ముగింపు ఉత్సవాలకు కూడా భ‌క్తులు భారీగా తర‌లివ‌చ్చారు. దీనిపై ఆ రాష్ర్ట‌ ప్రభుత్వం హ్యాపీగా ఉంది. కానీ ఒక్క విషయంలో ప్రభుత్వ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారని, దానికి మిత్ర‌ప‌క్ష బీజేపీ కార‌ణ‌మ‌ని స‌మ‌చారం.

ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు స్వయంగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రప‌తి ప్రణబ్‌ ముఖర్జీని, కేంద్రమంత్రుల్ని, బీజేపీ పెద్దల్ని కలిసి పుష్కరాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. కనీసం పది మంది కేంద్ర మంత్రులతో పాటు జాతీయస్థాయిలో పేరున్న నేతలు, సెలబ్రిటీలు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. వచ్చేవారికోసం ఏర్పాట్లు కూడా చేసింది. కానీ ఒక‌రిద్ద‌రు మిన‌హా ముఖ్య‌లు ఎవరూ రాకపోవడంతో ప్రభుత్వం నిరుత్సాహంతో ఉన్నట్టు తెలుస్తోంది. మిత్ర‌ప‌క్ష‌మైన త‌మ ప్ర‌భుత్వం ఆహ్వానిస్తే రాక‌పోవ‌డం ఏంట‌ని ప‌లువురు తెలుగుత‌మ్ముళ్లు స‌ణుక్కున్నారు కూడా.

అయితే కేంద్రమంత్రులు పుష్కరాలకు రాకపోవడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. గోదావరి పుష్కరాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. బాబు పిలిచారు కదా అని అంతా రాజమండ్రి వెళ్తే... తెలంగాణలో బీజేపీ నేతలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని క‌మ‌ల‌ద‌ళం అగ్ర‌నేత‌లు అనుకున్నారట. ఒక రాష్ట్రానికి వెళ్లి మరో రాష్ట్రానికి వెళ్లకుండా ఉండటం మంచిది కాదన్న అభిప్రాయంతోనే కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలు పుష్కర స్నానాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎక్కడికో ఒక‌చోటికే వెళ్లి ఆ విషయంలో ఇబ్బంది పడకూడదనే మంత్రులు పుష్కరాలకు రాలేదని స‌మాచారం.