Begin typing your search above and press return to search.

వైసీపీ రియల్ పొజిషన్ ఇదేనట...రిపోర్టు ఇచ్చేసిన పీకే టీం...?

By:  Tupaki Desk   |   5 Sep 2022 10:32 AM GMT
వైసీపీ రియల్  పొజిషన్ ఇదేనట...రిపోర్టు ఇచ్చేసిన పీకే టీం...?
X
ఏపీలో ఎపుడు ఎన్నికలు వచ్చినా వైసీపీకి ఎదురులేదని అంతా అనుకున్నారు. నిజానికి జాతీయ సర్వేలు పేరిట ఇప్పటిదాకా వచ్చినవి అన్నీ కూడా ఢంకా భజాయించి అదే చెప్పుకొచ్చాయి. దాంతో ఎట్టి పరిస్థితుల్లో 130 సీట్లకు తగ్గకుండా అసెంబ్లీ, 18కి తగ్గకుండా ఎంపీ సీట్లను వైసీపీ కైవశం చేసుకుంటుంది అని ఫ్యాన్ పార్టీ నేతలు తెగ ఖుషీ చేసుకున్నారు. అయితే గ్రౌండ్ రియాల్టీస్ ని జాతీయ సర్వేలు సరిగ్గా అంచనా వేయలేదని ఇపుడు తాపీగా పీకే టీం చేసిన ఒక సర్వే ఫలితాలను చూస్తే అర్ధమవుతోంది అంటున్నారు.

పీకే టీం ఈ మధ్యనే చేసిన ఒకానొక సర్వే అయితే ఏపీలో వైసీపీకి అంత గెలుపు ధీమా లేదనే చెబుతోంది అంటోందిట. ఈ సర్వే నివేదిక మీద ఇప్పటికే ప్రచారం సాగుతోంది. దాని ప్రకారం వైసీపీకి కంచుకోట లాంటి రాయలసీమలోనే ఈసారి వైసీపీకి రిజల్ట్స్ తేడా కొడతాయని అంటున్నారు. అలాగే ఉత్తరాంధ్రా జిల్లాలలో సగానికి సగం సీట్లు పోతాయని, గోదావరి జిల్లాలలో కూడా అదే రకమైన సీన్ ఉంటుందని చెబుతోందిట.

ఇక కోస్తా జిల్లాలలో చూసుకుంటే వైసీపీకి మునుపటి సీట్లు బాగా తగ్గుతాయని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే చాలా కష్టం మీద వైసీపీ మ్యాజిక్ ఫిగర్ ని చేరుకునే చాన్స్ ఉంటుందని చెబుతోంది. అంటే ఏపీలో సర్కార్ ని ఏర్పాటు చేయాలంటే 88 సీట్లు అవసరం అయితే 89 సీట్లు మాత్రమే వైసీపీకి వస్తాయని లెక్కలు వేసి మరీ చెప్పినట్లుగా ప్రచారం అయితే ఉంది. అది కూడా ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితేనే.

అదే విధంగా జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోకపోతే అన్న కండిషన్ కూడా ఉందిట. మరి పొత్తులు పెట్టుకుని ఆ రెండు పార్టీలు రంగంలో నిలిస్తే కనుక గోదావరి జిల్లాలు కోస్తా ప్రాంతంలో ఇపుడు వచ్చిన సగం సీట్లు కూడా ఇంకా బాగా తగ్గిపోతాయని అంటున్నారు. అంటే అపుడు విపక్షంలోనే వైసీపీ కూర్చోవాల్సి ఉంటుందని అంటున్నారు.

ఇక వైసీపీ అర్బన్ ప్రాంతంలో బాగా వీక్ అయిందని, అలాగే ఉద్యోగులు గుర్రు మీద ఉన్నారని, నిరుద్యోగ యువత కూడా అసంతృప్తి మీద ఉందని సర్వే చెప్పినట్లుగా అంటున్నారు. అలాగే చదువుకున్న వారు, మధ్యతరగతి వర్గాలు సర్కార్ కి దూరం అయ్యారని అంటున్నారు. ఈ నేపధ్యంలో రూరల్ లో ఇంకా వైసీపీ పట్టు కొనసాగుతోందని, సంక్షేమ పధకాల వల్ల ఆయా సెక్షన్లు మాత్రం వైసీపీ పట్ల సుముఖంగా ఉన్నారని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే వచ్చే ఎన్నికలు వైసీపీకి ఏ మాత్రం ఈజీ టాస్క్ కాదనే ఈ సర్వే చెప్పినట్లుగా అంటున్నారు.

ఇక ఏకంగా 20 అసెంబ్లీ సీట్లలో వర్గ పోర్తు పీక్స్ లో ఉందని, మరో 45 సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలు జనాల నుంచి పూర్తి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని కూడా సర్వే నిగ్గు తేల్చింది అని అంటున్నారు. ఆ విధంగా చూస్తే ఈ 65 సీట్లలో తక్షణం రిపేర్లు చేసుకోవాలని కూడా సూచనలు వచ్చాయట. అలాగే పార్టీ పట్ల విముఖంగా ఉన్న వర్గాలను తిరిగి దగ్గర చేసుకోకపోతే రెండవ సారి వైసీపీ విజయం అన్నది కష్టం కావచ్చు అన్నదే సర్వే చెప్పిన సత్యం అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.