Begin typing your search above and press return to search.

రూ.68,600 కోట్ల డిఫాల్టర్ల రుణాలు మాఫీ, ఆర్టీఐ ద్వారా వెలుగులోకి

By:  Tupaki Desk   |   28 April 2020 5:30 PM GMT
రూ.68,600 కోట్ల డిఫాల్టర్ల రుణాలు మాఫీ, ఆర్టీఐ ద్వారా వెలుగులోకి
X
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రూ.68,000 కోట్ల రుణాల్ని రద్దు చేసిందట. ఈ మేరకు సమాచార హక్కు చట్టం ద్వారా ఓ వ్యక్తి ఈ వివరాలపై ఆరా తీశాడు. దేశంలోని 50 మంది బ్యాంకు డిఫాల్టర్లపై ఆర్బీఐ వరాల జల్లు కురిపించిందని సమాచార హక్కు చట్టం ద్వారా బయటకు వచ్చింది. దీని ప్రకారం రూ.68,600 కోట్ల రుణాలను రద్దు చేసింది. విల్ ఫుల్ డిఫాల్టర్లకు, పరారీలో ఉన్న వారికి ఇంత పెద్ద మొత్తంలో రుణ మాఫీ చేశారట.

ఆర్బీఐ చేసిన ఈ రుణమాఫీతో లాభపడిన వారిలో పరారీలో ఉన్న గీతాంజలి జెమ్స్ అధినేత చోక్సీ, ఈడీ స్కానర్‌లో ఉన్న సందీప్ ఝున్‌ఝున్‌వాలా తదితరులు ఉన్నారు. మాఫీ చేసిన రుణాల్లో పరారీలో ఉన్న చోక్సీ, అతని గ్రూప్‌కు చెందినవే రూ.7వేల కోట్ల వరకు ఉన్నట్లుగా సమాచారం. విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిల్ లైన్స్ కూడా ఈ జాబితాలో ఉందని తెలుస్తోంది. తాను తీసుకున్న అప్పులు చెల్లిస్తానని బ్రిటన్‌లో దాక్కున్న మాల్యా పదేపదే చెబుతున్నారు. కానీ రుణాలు రద్దు చేసిన వారి జాబితాలో కింగ్ ఫిషర్ కూడా ఉందని వార్తలు వస్తున్నాయి.

పతంజలికి చెందిన యోగా గురువు రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణ గ్రూప్ కూడా రుణమాఫీ ద్వారా రూ.2,212 కోట్లు లబ్ధి పొందిందట. గత కొన్నాళ్లుగా భారీగా విస్తరిస్తూ, లాభాల్లో ఉన్న రామ్‌దేవ్ బాబా వంటి కంపెనీలకు భారీ మొత్తం రుణమాఫీ చేయడం గమనార్హం. విల్ ఫుల్ డిఫాల్టర్లైన 50 మందికి చేసిన రుణమాఫీ వివరాలను, వారి పేర్లను బయటపెట్టాలని రాహుల్ గాంధీ సభలో కోరగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిరాకరించారు. ఈ వివరాల కోసం ఇప్పుడు ఆర్టీఐ ద్వారా ఓ కార్యకర్త ఆశ్రయించగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.