Begin typing your search above and press return to search.

కోదండం మాష్టారుపై టీడీపీ కొత్త స్కెచ్‌

By:  Tupaki Desk   |   16 Aug 2016 2:02 PM GMT
కోదండం మాష్టారుపై టీడీపీ కొత్త స్కెచ్‌
X
తెలంగాణ‌ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ఫోన్లను ట్యాప్ చేసిన‌ట్లు వెలువ‌డిన వార్త‌లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. తెలంగాణ‌వాదులు దీనిపై ఘాటుగా స్పందిస్తుండ‌గా... ఈ విష‌యంలో తెలుగుదేశం పార్టీ మాష్టారుకు అండ‌గా నిలిచింది. రాజకీయ ఐకాసను ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరిని భాగస్వామ్యం చేయ‌డం ద్వారా చురుకైన పాత్రను వహించిన కోదండరాంపైనే నిఘాపెట్టారంటే ప్రభుత్వం ఏదిశగా ఆలోచిస్తున్నదో పత్రికాధిపతులు - ప్రజాసంఘాలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని టీడీపీ పొలిట్‌ బ్యూరో స‌భ్యుడు రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులపై - తనకు గిట్టనివారిపై నిఘాపెట్టే సంస్కృతిని ప్రవేశపెట్టిందని ఆయ‌న మండిప‌డ్డారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ సంగ‌తి ఏమోకానీ త‌న నియంతృత్వ దోర‌ణితో అనేక రికార్డుల‌ను మాత్రం సాధించార‌ని రావుల ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలపై ప్రజలకు తెలియజేసిన విద్యుత్ రంగ నిపుణులు - తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన రఘును బదిలీచేయించడమేకాక ఆయన పుస్తకం రాస్తే దానిపై షోకాజ్ నోటీసు ఇచ్చారని గుర్తుచేశారు. ఏబీఎన్ - టీవీ9 ఛానళ్లను నిషేధించి మీడియాపై ఒత్తిడి తీసుకొచ్చిన విషయం అందరికి తెలిసిన విషయమేన‌ని చెప్పారు. తెలంగాణ వాదులు ఏకీకరణ జరగాలని టీఆర్ ఎస్ నాయకులు పదేపదే చెప్పారని అయితే దీనికి విరుద్ధంగా ఏకైకీకరణ జరుగుతున్నదని రావుల ఎద్దేవా చేశారు. అందరినీ కలుపుకుపోతానని కేసీఆర్ చెప్పారని అయితే ఆచ‌ర‌ణ‌లో మాత్రం అందరినీ తన పార్టీలో కలుపుకొంటున్నారని విమ‌ర్శించారు. తెలంగాణలోని 5 పార్టీలను చీల్చిన ఘనత కేసీఆర్‌ ద‌ని పేర్కొంటూ ఒక సీఎం హోదాలో చెడ్డ సంప్ర‌దాయంతో ఆయ‌న రికార్డు సృష్టించార‌ని రావుల‌ మండిప‌డ్డారు. న్యాయవ్యవస్థపై కూడా దురుద్దేశాలు ఆపాదిస్తూ టీఆర్ ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారని ప్ర‌స్తావించారు.

జేఏసీ చైర్మ‌న్‌ కోదండరాంపై ట్యాపింగ్ పరాకాష్ట‌కు చేరిందని రావుల మండిప‌డ్డారు. రాజకీయ భిన్న ధ్రువాలుగల రాజకీయపార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకరావడానికి ఐకాస - కోదండరాం అవసరమొచ్చింది కానీ ఇప్పుడు టీఆర్ ఎస్ మంత్రులు జేఏసీకి పని ఏమిటని ప‌క్క‌న పెడుతున్నార‌ని త‌ప్పుప‌ట్టారు. కానీ సామాజిక తెలంగాణ కోసం జేఏసీ అవసరం ఇప్పుడే ఉందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దళితులను - గిరిజనులను మోసం చేశారని 3 ఎకరాల భూమిని అటకెక్కించారని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తెలంగాణ వాదులను మానసికంగా ఒత్తిడి తెస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని రావుల స్ప‌ష్టం చేశారు.