Begin typing your search above and press return to search.

ధోని జీతం అతడికి.. మరి కాబోయే కెప్టెనేనా?

By:  Tupaki Desk   |   2 Dec 2021 2:30 AM GMT
ధోని జీతం అతడికి.. మరి కాబోయే కెప్టెనేనా?
X
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఆ మాటకొస్తే టీమిండియా కూ అతడే అత్యంత విజయవంతమైన సారథి. 2020 ఐపీఎల్ సీజన్ లో ఘోర ఓటమి పాలైన సీఎస్కే ను ఈ సారి విజేతగా నిలపడంలోనే ధోని నాయకత్వ పటిమ ఏపాటిదో తెలుస్తుంది. అయితే, అతడికి 40 దాటుతున్నాయి. కీపింగ్ పర్వాలేకున్నా.. బ్యాటింగ్ దమ్ము తగ్గింది. భారీ షాట్లు ఆడలేకపోతున్నాడు. మునుపటిలా బౌలింగ్ దాడిని కాచుకోలేకపోతున్నాడు. పరుగుల కోసం ప్రయాస పడుతున్నాడు. సారథిగా రాణిస్తున్నా.. వచ్చే ఏడాదో, ఆపై ఏడాదో గుడ్ బై చెప్పక తప్పదు. సాధారణంగా అయితే సీఎస్కేలో ధోని తర్వాత సీనియర్ సురేశ్ రైనా. పలుసార్లు జట్టును నడిపించాడు కూడా. అయితే, ఇప్పుడతడు ఫామ్ లో లేడు. అసలు కొనసాగుతాడో లేదో తెలియదు. మరి భవిష్యత్ కెప్టెన్ ఎవరు?

కోహ్లి అంతటి సమర్థుడు

ధోని 2014 డిసెంబరులో అంతర్జాతీయ టెస్టు కెరీర్ కు వీడ్కోలు పలికాడు. అప్పటికి విరాట్ కోహ్లి పూర్తి స్థాయి ఆటగాడిగా ఎదిగాడు. అద్భుత బ్యాట్స్ మన్ గా ఉన్న అతడికి ధోని కెప్టెన్సీ అప్పగించాడు. ఆ తర్వాత భారత క్రికెట్ ను విరాట్ మరో ఎత్తుకు తీసుకెళ్లాడు. వన్డేలు ,టి20ల్లోనూ అతడు గొప్పగా రాణించడమే కాక జట్టునూ అదే స్థాయిలో నడిపాడు. మరి సీఎస్కే పగ్గాలూ ధోని అలాంటి స్థాయి వ్యక్తికే ఇవ్వాలి.

అతడు ఇతడేనా?

సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అంబటి రాయుడు దాదాపు టీమిండియాకు దూరమైనట్టే. రుతురాజ్ గైక్వాడ్ జూనియర్. విదేశీ ఆటగాళ్లలో బ్రేవో కూడా రిటైరయ్యాడు. డుప్లెసిస్ కెరీర్ చివర్లో ఉన్నాడు. మరి ధోని తర్వాత సీఎస్కే పగ్గాలు ఎవరికంటే.. అందరికీ గుర్తుకొస్తున్న ఏకైక పేరు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. చెన్సై సారథిగా అన్ని అర్హతలున్న ఆటగాడు జడేజా. మూడు నాలుగేళ్లుగా జడేజా ఎలా ఆడుతున్నాడో అందరికీ తెలిసిందే.
అదే జరిగితే..

19 ఏళ్లకే టీమిండియాలో అడుగు పెట్టాడు రవీంద్ర జడేజా. ఆపై ఎన్నో ఒడిదొడుకులు. జట్టుకూ దూరమయ్యాడు. అలాంటి సందర్భాల్లో రంజీల్లో ట్రిపుల్ సెంచరీల మోత మోగించి మళ్లీ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. టెస్టుల్లో అదీ సొంతగడ్డపై జడేజా ఎంతటి ప్రధాన ఆటగాడో మొన్నటి న్యూజిలాండ్ మ్యాచ్ నిరూపించింది. బౌలర్ గా బ్యాట్స్ మన్ గా జడేజా ప్రస్తుతం తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు. ఇక ఫీల్డర్ గా అతడికి వంక పెట్టేదే లేదు. ఎంత దూరం నుంచైనా బంతిని నేరుగా వికెట్ కు విసరగల సమర్థుడు. క్లిష్టమైన క్యాచ్ లు పట్టడంలో, బంతిని ఆపడంలో జడేజాకు తిరుగులేదు. అందుకే సీఎస్కే కే సారథిగా జడేజాకే అందరి ఓటు పడుతుందనడంలో సందేహం లేదు. అంతేకాక.. జడేజా .. విరాట్ కోహ్లి, అజింక్య రహానే సమకాలికుడు. వీరితో పాటు అండర్19లో భారత్ కు ఆడాడు. వారిద్దరూ కెప్టెన్లయిన నేపథ్యంలో జడేజాకూ పగ్గాలు దక్కితే అది కొంత ప్రత్యేకమే.

కొసమెరుపు..గత ఐపీఎల్ సీజన్ వరకు ధోనికి సీఎస్కే చెల్లించిన మొత్తం రూ.16 కోట్లు. ఈసారి అదే మొత్తానికి జడేజాను సీఎస్కే రిటైన్ చేసుకుంది. ధోనికి రూ.12 కోట్లే ఇవ్వనుంది. దీన్నిబట్టి సీఎస్కే భావి సారథి సర్ రవీంద్ర జడేజానే అని తెలిసి పోవడం లేదూ? వచ్చే సీజన్ కు సంబంధించి జనవరిలో వేలం జరుగనుంది. బహుశా ఏప్రిల్ లో సీజన్ ప్రారంభం కానుంది.