Begin typing your search above and press return to search.

బీడీ సత్తెమ్మకు కేంద్రమంత్రి ఫోన్ చేశారు

By:  Tupaki Desk   |   27 March 2016 5:18 AM GMT
బీడీ సత్తెమ్మకు కేంద్రమంత్రి ఫోన్ చేశారు
X
ఇంత పెద్ద దేశంలో ఎక్కడో మారుమూలన ఉన్న కోరుట్ల సత్తెమ్మను కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వయంగా ఫోన్ చేయటమే కాదు.. ఆమెకు కంగ్రాట్స్ చెప్పిన వైనం ఇప్పుడు అందరికి ఆసక్తిగా మారింది. ఇంతకీ కోరుట్ల సత్తెమ్మ స్పెషాలిటీ ఏమిటి? అని చూస్తే.. ఏమీ కనిపించవు. 58 ఏళ్ల వయసులో తెలంగాణలోని కరీంనగర్ లోని ఒక సాదాసీదా బీడీ కార్మికురాలు. మరి.. అలాంటి సాదాసీదా వ్యక్తికి కేంద్రమంత్రి స్వయంగా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పటం ఏమిటన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికరంగానే కాదు.. ఎంతోకొంత స్ఫూర్తినివ్వటం ఖాయం.

బీడీలు చుడుతూ పొట్టబోసుకునే సత్తెమ్మ కొడుకు దుబాయ్ లో ఉంటున్నాడు. అతనితో తరచూ మాట్లాడేందుకు కంప్యూటర్ లోని స్కైప్ తో మాట్లాడే వీలు ఉండటం.. అందుకు తరచూ ఎవరో ఒకరిని బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి. ఇదంతా ఎందుకు.. తానే కంప్యూటర్ ఆపరేట్ చేయటం నేర్చుకుంటే పోలా అని 58 ఏళ్ల వయసులో ఆమెకు అనిపించింది.

అంతే.. కేంద్రం ప్రవేశ పెట్టిన డిజిటల్ అక్షరాస్యతా కార్యక్రమంలో చేరిపోయారు. భారతీ ఆన్ లైన్ సర్వీసెస్ అనే సంస్థలో చేరిన ఆమె.. ఆ ఇనిస్టిట్యూట్ లో కంప్యూటర్ పాఠాలు నేర్చుకుంటున్న వారిలో ఆమె పెద్ద వయస్కురాలు. ఈ వయసులోనూ ఆమె కంప్యూటర్ నేర్చుకోవటానికి ప్రదర్శించిన ఆసక్తి ఢిల్లీలో ఉన్న కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కు చేరిపోయింది. దీంతో.. సంతోషపడిపోయిన ఆయన.. ఆమెకు స్వయంగా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. సత్తెమ్మె ఇరుగుపొరుగు ఉన్న మహిళలకు కంప్యూటర్ నేర్చుకునేలా ప్రోత్సాహించాలని సత్తెమ్మను తాను కోరుకున్నట్లుగా కేంద్రమంత్రి ఫేస్ బుక్ లో రాసుకొచ్చారు. ఇప్పుడు చెప్పండి మన.. బీడీ సత్తెమ్మ గ్రేట్ కదూ.

ఇలాంటి సత్తెమ్మలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటివాళ్లు మరో అడుగు ముందుకేసి.. కంప్యూటర్ లాంటివి కొనిస్తే మరింత బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. మరి.. ఈ విషయంలో ఆయన ఎలా రియాక్ట్ అవుతారో..?