Begin typing your search above and press return to search.

తప్పు దిద్దుకుంటున్న ఏపీ సర్కారు

By:  Tupaki Desk   |   24 July 2022 6:33 AM GMT
తప్పు దిద్దుకుంటున్న ఏపీ సర్కారు
X
ఆంధ్రాలో బీజేపీ నాయ‌కుల నిర‌స‌న‌లు ఫ‌లించాయి. అదేవిధంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ హెచ్చ‌రిక‌లూ ఫ‌లించాయి. దీంతో ఎట్ట‌కేల‌కు ఏపీ స‌ర్కారు దిగివ‌చ్చింది. ఆగస్టు ఒక‌టి నుంచి ప్ర‌ధాన మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ ఆవాస్ యోజ‌న కింద కేంద్రం అందించే బియ్యాన్ని పంచేందుకు సిద్ధం అవుతోంది . గ‌త మూడు నెల‌లుగా తాము బియ్యం ఇచ్చినా కూడా పంపిణీ చేయ‌కుండా తాత్సారం చేయ‌డంపై ఇటీవ‌లే కేంద్రం కోపంతో ఊగిపోయింది. బియ్యం పంపిణీ అన్న‌ది చేయ‌క‌పోతే పేద‌ల‌కు తాము చెప్పిన విధంగా వాటిని నిబంధ‌న‌ల అనుసారం అందించ‌క‌పోతే రాష్ట్రంలో ధాన్యం సేక‌ర‌ణ ఆపేస్తామ‌ని కేంద్రం హెచ్చ‌రిక‌లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే !

కొంత క్లారిటీ మిస్సింగ్ : ఆ బియ్యం అంద‌రికీ కాదు కొంద‌రికే !

ఏపీ స‌ర్కారు వ‌చ్చే నెల ఒక‌టి నుంచి 88.7 లక్ష‌ల మందికి కేంద్రం త‌ర‌ఫున బియ్యం పంపిణీకి పూనుకోనుంద‌ని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రేష‌న్ డీల‌ర్ల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు చేరాయ‌ని ప్ర‌ధాన మీడియా చెబుతోంది. రేష‌న్ డీల‌ర్ల ద్వారా కూపన్లపై సంబంధిత ల‌బ్ధిదారుల‌కు ఈ బియ్యాన్ని పంపిణీ చేయాల‌ని నిబంధన‌లు చెబుతున్నాయి. వీటినే పాటిస్తూ ఆగ‌స్టు ఒక‌టి నుంచి సంబంధిత చ‌ర్య‌లను షురూ చేయ‌నున్నారు. అయితే ఇదే సంద‌ర్భంలో వివిధ కార‌ణాల‌తో 56.6ల‌క్ష‌ల మంది కార్డు దారుల‌కు ఈ బియ్యం అంద‌ద‌ని కూడా తెలుస్తోంది. దీనిపై కూడా కేంద్ర ప్ర‌భుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి కానీ ఓ క్లారిటీ రావాల్సి ఉంది.

ఆఫీస‌ర్స్ బీ అల‌ర్ట్ : తిండి గింజ‌లు ప‌క్క‌దోవ ప‌డ్తాయ్ జాగ్ర‌త్త !

పీఎంజీఏవై కింద న‌లుగురు ఉండే కుటుంబానికి ఒక్కొక్క‌రికీ 5 కేజీలు చొప్పున 20 కేజీల బియ్యం అందిస్తారు. అంటే న‌లుగురు ఉండే ఓ కుటుంబానికి నెల‌కు 20 కిలోల చొప్పున, ఇప్ప‌టిదాకా 5 నెల‌ల బ‌కాయికి సంబంధించి 100 కేజీల బియ్యం అందించాల్సి ఉంది. వీటి విలువ బ‌హిరంగ మార్కెట్లో నాలుగు వేల ఎనిమిది వందల‌కు ప‌లికే అవ‌కాశం ఉంది. తక్కువ‌లో త‌క్కువ నాలుగు వేలు రూపాయ‌లు విలువ చేసే బియ్యం కేంద్రం నుంచి అందితే వీటిని పక్క‌దోవ ప‌ట్టించే ఘ‌నులూ ఉన్నారు. క‌నుక బియ్యం స‌ర‌ఫ‌రా ఎంత ముఖ్యమో, బ‌హిరంగ మార్కెట్లోకి ఇవి అమ్ముడు పోకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఇప్ప‌టికే పౌర స‌ర‌ఫ‌రాల శాఖ ద్వారా పంపిణీ అయిన బియ్యం కాకినాడ పోర్టు ద్వారా ప‌క్క దేశాల‌కు త‌ర‌లిపోయింద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

క‌నుక ఇటువంటి నిబంధ‌న‌ల‌కు తూట్లు పొడిచే ప‌నులు లబ్ధిదారులు చేయ‌కుండా అధికారులు అప్ర‌మత్తం కావాల్సి ఉంది. మ‌రోవైపు కేంద్రం చెప్పిన విధంగా బియ్యం పంపిణీ చేసేందుకు చాలినంత నిల్వ‌లు ఏపీ ప్ర‌భుత్వం దగ్గ‌ర లేవ‌ని విమర్శలు వినిపిస్తున్నాయి. క‌నుక వీలున్నంత వ‌ర‌కూ బియ్యం సర్దుబాటు చేసి పంపిణీ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి అని తెలుస్తోంది. వీటికి సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాలు సోమ‌వారం విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని సంబంధిత మంత్రి వ‌ర్గ ప్ర‌తినిధులు చెబుతున్నారు.