Begin typing your search above and press return to search.

ఏటీఎం నుంచి రేష‌న్.. దేశంలోనే తొలిసారిగా!

By:  Tupaki Desk   |   16 July 2021 3:25 PM GMT
ఏటీఎం నుంచి రేష‌న్.. దేశంలోనే తొలిసారిగా!
X
రెండు ద‌శాబ్దాల క్రితం ఆటోమేటెడ్ టెల్ల‌ర్ మెషీన్ (ఏటీఎం) నుంచి డ‌బ్బులు రావ‌డ‌మే వింత‌గా చూశారు జ‌నం. ఆ త‌ర్వాత వాట‌ర్ స్కీమ్ కూడా ప్ర‌వేశ‌పెట్టారు. కార్డు స్వైప్ చేస్తే ఎన్ని నీళ్లు రావాలో.. అన్ని వ‌చ్చే విధానాన్ని అమ‌లు చేశారు. ఇది కూడా జ‌నాన్ని అబ్బు ప‌రిచింది. ఇక‌, ఇప్పుడు కొత్త‌గా రేష‌న్ సరుకులు కూడా ఏటీఎం విధానం ద్వారా అందిస్తున్నారు. దీని ద్వారా కార్డు స్వైప్ చేస్తే.. ఎన్ని కేజీల బియ్యం అందించాలో అంతే బియ్యం వ‌చ్చి ఆగిపోతాయి. ఇప్పుడు ఈ మెషీన్ దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

దేశంలోనే తొలి రేష‌న్ ఏటీఎంను హ‌ర్యానా ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టింది. ప్ర‌స్తుతం పైల‌ట్ ప్రాజెక్టుగా చేప‌ట్టిన ఈ విధానం గురుగ్రామ్ లోని ఫ‌రూక్ న‌గ‌ర్లో అందుబాటులో ఉంది. తాజాగా.. ఉప ముఖ్య‌మంత్రి దుష్యంత్ చౌతాలా దీన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించాల‌నే ఉద్దేశంతోనే ఈ మెషీన్ ను అందుబాటులోకి తెచ్చిన‌ట్టు చెప్పారు. ఈ సంద‌ర్బంగా ఈ ఆటోమేటెడ్ టెల్ల‌ర్ మెషీన్ ఎలా ప‌నిచేస్తుంద‌నే విష‌యాన్ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు.

ఈ ఏటీఎం మెషీన్ కేవ‌లం ఐదు నిమిషాల్లో 70 కేజీల బియ్యాన్ని రిలీజ్ చేస్తుంది. గోధులు, ఇత‌ర చిరు ధాన్యాలు కూడా ఇదే విధంగా విడుద‌ల చేస్తుంది. ఈ మెషీన్ లో బ‌యోమెట్రిక్ వ్య‌వ‌స్థ ఉంటుంది. ఇందులో న‌మోదు చేయ‌గానే.. ల‌బ్ధిదారునికి ఎంత ధాన్యం రావాలో.. కౌంట్ చేసి మ‌రీ అంతే ధాన్యం రిలీజ్ చేస్తుంది. ఈ విధానం ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యోగక‌రంగా ఉంటుంద‌ని హ‌ర్యానా ఉప ముఖ్య‌మంత్రి ఉప ముఖ్య‌మంత్రి దుష్యంత్ చౌతాలా తెలిపారు. అంతేకాదు.. పార‌ద‌ర్శ‌కంగా, ఎలాంటి అవినీతి, అక్ర‌మం చోటు చేసుకోకుండా ఉంటుంద‌ని చెప్పారు. ఈ ప్రాజెక్టును చేప‌ట్ట‌డంలో ముఖ్య ఉద్దేశం కూడా ఇదేన‌ని దుష్యంత్‌ చౌతాలా తెలిపారు.

ప్ర‌స్తుతం ఈ పైల‌ట్ ప్రాజెక్టు గురుగ్రామ్ లోని ఫ‌రూక్ న‌గ‌ర్లో మాత్ర‌మే అందుబాటులో ఉంచామ‌ని, ఇది విజ‌య‌వంతంగా కొన‌సాగిన అనంత‌రం రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేయ‌నున్నామ‌ని తెలిపారు. ఈ మెషీన్ వ‌ల్ల రేష‌న్ స‌రుకుల్లో అక్ర‌మాలు జ‌ర‌గ‌వు కాబ‌ట్టి.. రేష‌న్ కొర‌త‌ను కూడా నివారించొచ్చ‌ని డిప్యూటీ సీఎం దుష్యంత్ తెలిపారు. ప్ర‌స్తుతం గోధుమ‌లు మాత్ర‌మే అందిస్తున్నామ‌ని, త్వ‌ర‌లో.. ధాన్యం, చిరు ధాన్యాలు కూడా ఈ ఏటీఎం మెషీన్ ప‌ద్ధ‌తిలోనే అందించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని చెప్పారు. ఈ కొత్త విధానం చూసిన స్థానికులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

నిజానికి.. రేష‌న్ దుకాణాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో అంద‌రికీ తెలిసిందే. రేష‌న్ షాపుల్లోని వారు దొంగ‌చాటుగా రేష‌న్ బియ్యం త‌ర‌లిస్తూ లారీల‌కు లారీలు, ఇత‌ర వాహ‌నాలు ప‌ట్టుబ‌డ్డ సంద‌ర్భాలు కోకొల్ల‌లు. రేష‌న్ బిధానంలో ఉన్న లొసుగుల‌ను అడ్డం పెట్టుకొని.. పందికొక్కుళ్లా దొబ్బితిన్న రేష‌న్ డీల‌ర్ల‌కు అంతే లేదు. ఈ ప‌రిస్థితి అంత‌టా ఉంది. ఉద్దేశ‌పూర్వ‌కంగానే.. బియ్యం మిగిలించుకోవ‌డం నుంచి.. నెల మొత్తం పంపిణీ చేయ‌కుండా మూసేసి.. ఆ త‌ర్వాత అమ్ముకుంటున్న‌వారు ఎంద‌రో ఉన్నారు. దాదాపు 90 శాతానికి పైగా డీల‌ర్లు ఇదే ప‌ద్ధ‌తిలో ఉన్నారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ఏటీఎం విధానం వ‌ల్ల పార‌ద‌ర్శ‌క‌త ఎక్కువ‌గా ఉంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం హ‌ర్యానాలో కొన‌సాగుతున్న ఈ పైల‌ట్ ప్రాజెక్టు స‌క్సెస్ అయితే.. దేశంలోని ఇత‌ర ప్రాంతాల్లోనూ ప్ర‌వేశ పెడితే బాగుంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్తమ‌వుతోంది.