Begin typing your search above and press return to search.

7న అరుదైన రాజకీయ ఘట్టం... మంత్రుల రాజీనామా...?

By:  Tupaki Desk   |   4 April 2022 7:28 AM GMT
7న అరుదైన రాజకీయ ఘట్టం... మంత్రుల రాజీనామా...?
X
ఏపీలో అరుదైన రాజకీయ ఘట్టానికి తెర లేవనుంది. వైసీపీ ప్రభుత్వంలో మొత్తానికి మొత్తం మంత్రులు మూకుమ్మడి రాజీనామాలు చేయనున్నారు. దానికి ఈ నెల 7వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నారు. ఆ రోజుతో మంత్రులంతా ఒక్కసారిగా మాజీలు అవుతారు. ఒక విధంగా ప్రస్తుత మంత్రుల పదవీ కాలానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనే చెప్పాలి.

ఈ నెల 7వ తేదీన చివరిసారిగా ప్రస్తుత మంత్రిమండలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశం అవుతుంది. ఈ సమావేశం ఆ రోజు మధ్యాహ్యం మూడు గంటలకు ప్రారంభం అయి సుదీర్ఘంగా సాగుతుంది అని తెలుస్తోంది. ప్రస్తుత మంత్రులతో చివరి సమావేశం కాబట్టి ఫుల్ ఎమోషనల్ గా ఈ భేటీ ఉంటుంది అంటున్నారు.

ఇక మొత్తం 23 మంది మంత్రులు ఈ సమావేశానికి రానున్నారు. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాల కంటే కూడా ఒక ధన్యవాద సమావేశంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మంత్రుల గురించి వారు చేసిన సేవల గురించి జగన్ పేరు పేరుగా ప్రస్థావించి మాట్లాడుతారు అని అంటున్నారు.

ఈ సమావేశం ముగిసిన తరువాత మంత్రులు అంతా జగన్ కి తమ రాజీనామా పత్రాలను అందచేస్తారని ప్రచారం సాగుతోంది. అనంతరం వాటిని గవర్నర్ కి జగన్ పంపించి ఆమోదముద్రని తీసుకుంటారు. దాంతో జగన్ మనసుకు నచ్చినట్లుగా మంత్రులను ఎంపిక చేసుకునేందుకే మొత్తం మంత్రులు రాజీనామాలు ఇస్తారని అంటున్నారు. ఇక ఈ నెల 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది.

మొత్తం మీద చూస్తే ఏపీలో ఒక అరుదైన ఘట్టమే ఈ నెల 7న రాజకీయంగా చూడబోతారు అని అంటున్నారు. దాంతో ప్రస్తుత మంత్రుల పదవీ కాలం పూర్తి అయినట్లే. ఈ రోజుకు చూస్తే కచ్చితంగా మూడు రోజులు మాత్రమే మంత్రులుగా వైభోగం ఉందనుకోవాలి. మరి పాత మంత్రులలో తిరిగి ఎవరు కొత్త మంత్రివర్గంలో చేరుతారో చూడాలి.

ఏది ఏమైనా చాలా మంది మాజీలు కావడం ఖాయం. మరి వారికి జగన్ ఇచ్చిన భరోసా మేరకు వచ్చే ఎన్నికల్లో ఫస్ట్ వారు గెలవాలి, పార్టీని గెలిపించాలి. అపుడు సమీకరణలు అన్నీ సరిపోతేనే వారు తిరిగి మంత్రులు అవుతారు. మొత్తానికి ఆలోచిస్తే మాత్రం ఇపుడు జారిపోతున్న పదవిని తిరిగి పట్టుకోవడం అంటే బహు కష్టమనే అర్ధమయ్యే విషయం.