Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్ :అక్కడ హోరాహోరీ.. ఎవరి ధీమా వారిది!

By:  Tupaki Desk   |   1 April 2019 1:30 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్ :అక్కడ హోరాహోరీ.. ఎవరి ధీమా వారిది!
X
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి జరిగిన 2009 - 2014 ఎన్నికలు చాలా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే చివరికి స్వల్ప మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరిటాల సునీతమ్మ గట్టెక్కారు. కాగా 2019 ఎన్నికలు అంతే ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జిల్లాలోనే రాప్తాడు నియోజకవర్గం ప్రతి ఎన్నికలోనూ రసవత్తర పోరు సాగుతోంది. సమ ఉజ్జీలు పోటీ పడటమే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు 2009 - 2014 - 2019 ఎన్నికల్లో తోపుదుర్తి వర్సెస్‌ పరిటాల కుటుంబ సభ్యులే పోటీ పడుతున్నారు. అయితే గత రెండు పర్యాయాలు పరిటాల సునీతమ్మ పోటీలో ఉండగా.. ఈసారి ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌ పోటీ చేస్తున్నారు. కానీ వైఎస్సార్‌ సీపీ నుంచి తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి బరిలో ఉన్నారు. రాప్తాడు నుంచి పోటీ చేయడం ఆయనకిది మూడోసారి. అయితే ఈసారి కూడా గెలువు ఎవరికీ అంత సులువు కాదని తెలుస్తోంది.

రాప్తాడు నియోజకవర్గంలోకి రామగిరి - కనగానపల్లి - చెన్నేకొత్తపల్లి - ఆత్మకూరు - రాప్తాడు - అనంతపురం రూరల్‌ మండలాలు వస్తాయి. అయితే రామగిరిలో పరిటాల సునీత సొంత మండలం కాగా.. ఆత్మకూరు తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి సొంత మండలం. ఈ క్రమంలో మూడు మండలాల్లో టీడీపీ - మరో మూడు మండలాల్లో వైఎస్సార్‌ సీపీ బలంగా ఉంది. ఫలితంగా ఎవరు గెలిచినా పెద్ద మెజారిటీ రాకపోవచ్చనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. గత 2009లో పోటాపోటీగా సాగిన పోరులో అంతిమ విజయం టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతదే. కేవలం 1704 ఓట్ల తేడాతో అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి ఓటమి పాలయ్యారు. అదేవిధంగా 2014 ఎన్నికల్లో 7774 ఓట్ల మెజారిటీతో పరిటాల సునీత మరోసారి విజయం సాధించారు. అయితే అప్పటి నుంచి తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి జనాల్లో నిత్యం ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. దీనికి తోడు పరిటాల సునీతమ్మ తనయుడు పరిటాల శ్రీరామ్‌ అరాచకాలు చేస్తున్నారనే ఆరోపణలు భారీగా వచ్చాయి. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను బలవంతంగా టీడీపీలో చేర్చుకున్నారు.

వైఎస్సార్‌ సీపీలోకి వలసలు.. కానీ గత 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి - కనగానపల్లి - చెన్నేకొత్తపల్లి మండలాల్లాని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను బలవంతంగా టీడీపీలోకి చేర్చుకున్నారు. ఇందులో ప్రధాన పాత్ర పరిటాల శ్రీరామ్‌ దే అని ప్రచారం. అంతేకాకుండా పరిటాల సునీతమ్మ సోదరులు మురళి - బాలాజీ పలు గ్రామాల్లో బెదిరింపులకు గురి చేసి మరీ పార్టీలోకి చేర్చుకున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్‌ సీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న పలువురు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. వారికి అండగా ఉంటామని తోపుదుర్తి సోదరులు ముందుకు రావడంతో ప్రజలు నిర్భయంగా రావడం మొదలుపెట్టారు. ఈక్రమంలో వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో జోష్‌ నిండింది. అయితే వారంతా ముందు పార్టీలో ఉన్నవాళ్లే.. టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీ వస్తున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది. ఫలితంగా వైఎస్సార్‌ సీపీ నాయకులు మరింత చొరవ చూపి టీడీపీ అసలు కార్యకర్తలను తమ వైపు తిప్పుకోగలిగితే గెలుపు సులువు అయ్యే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.