Begin typing your search above and press return to search.

నువ్వు ఒక‌టి.. నేను నాలుగు.. టీఆర్ ఎస్ వ్యూహం.. తాజాగా రాపోలుకు కండువా!

By:  Tupaki Desk   |   27 Oct 2022 2:40 AM GMT
నువ్వు ఒక‌టి.. నేను నాలుగు.. టీఆర్ ఎస్ వ్యూహం.. తాజాగా రాపోలుకు కండువా!
X
``నువ్వు ఒక్క‌రిని తీసుకుంటే.. నేను న‌లుగురిని లాగేస్తా!`` అన్న‌ట్టుగా సాగుతోంది.. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌.. ప్ర‌తిప‌క్షం బీజేపీ మ‌ధ్య రాజ‌కీయం. తాజాగా బీజేపీ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ గులాబీ కండువా కప్పుకున్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ స్‌లో చేరారు. అంతకు ముందు బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు రాపోలు ప్రకటించారు. అరుణ్‌ జైట్లీ ప్రోత్సాహంతో 2019 ఏప్రిల్‌ నాలుగున బీజేపీలో చేరానని.. ఇంతకాలం పార్టీలో కలిసి ఉండే అవకాశం కల్పించినందుకు ఆ పార్టీ నేతలకు కృతజ్ఞతలు చెప్పారు.

బీజేపీ వ‌సుధైక కుటుంబం అనే భావనకు పెద్ద పీట వేస్తుందనుకొన్నానని.. ఈ సూత్రానికి పార్టీ నిజంగా కట్టుబడి ఉందా అనే అనుమానాన్ని రాపోలు వ్యక్తం చేశారు. దేశంలో ఇబ్బందికరమైన విచ్ఛిన్నకరమైన రాజకీయాలు ప్రోత్సహించబడుతున్నాయని రాపోలు ఆరోపించారు. పార్టీని వీడే సమయంలో తప్పులు ఎత్తి చూపడం తన లక్షణం కాదని ఆయన పేర్కొన్నారు.. నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకుంటారనే భావిస్తున్నట్లు తెలిపారు.

ప్రాంతీయత, భాషలు, స్థానిక ప్రజల భావోద్వేగాలను ఉద్దేశపూర్వకంగా చిన్నచూపు చూడడం పార్టీకి అలవాటుగా మారిందని రాపోలు ఆక్షేపించారు. ఏకభాషా పెత్తనాన్ని ప్రోత్సహించడం కూడా ఎక్కువైందని అభిప్రాయపడ్డారు. చేనేతపై జీఎస్టీని విధించి ఆ రంగాన్ని భూస్థాపితం చేద్దామని బీజేపీ చూస్తోందని విమర్శించారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని అన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఉచితాల కింద లెక్కగట్టడం తన మనసు లోతులను గాయపర్చిందని తెలిపారు. గడిచిన నాలుగేండ్ల కాలంలో జాతీయ స్థాయిలో తనను విస్మరించారని రాపోలు ఆనంద భాస్కర్ పేర్కొన్నారు.

ఇదిలావుంటే, ఇప్పటికే గులాబీ అపరేషన్ ఆకర్ష్తో బిక్షమయ్యగౌడ్ బీజేపీని వీడి గులాబీ పార్టీలో చేరారు. ఆ షాక్‌ నుంచి కమలనాథులు తేరుకోకముందే స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్ బీజేపీని విడిచి కారెక్కారు. తాజాగా రాపోలు చేరడంతో ఒక్క నెలరోజుల్లోనే నలుగురు పార్టీని విడిచినట్లు అయింది. దీంతో నువ్వు ఒక్క‌రిని లాక్కుంటే.. నేను న‌లుగురు.. అన్న సంకేతాలు.. టీఆర్ ఎస్ పంపిన‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.