Begin typing your search above and press return to search.

గన్ తిరుపతి టూర్ రద్దు వెనుక కారణం అదేనన్న రామ్మోహన్

By:  Tupaki Desk   |   11 April 2021 7:59 AM GMT
గన్ తిరుపతి టూర్ రద్దు వెనుక కారణం అదేనన్న రామ్మోహన్
X
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం జోరు ఓపక్క సాగుతున్న వేళ.. అనూహ్యంగా కొత్త అంశం తెర మీదకు వచ్చింది. తిరుపతి ఎన్నికల ప్రచారానికి వస్తానన్న సీఎం జగన్.. అనూహ్యంగా తన ప్లాన్ మార్చుకోవటం.. ప్రచారానికి రానని చెప్పటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోవటానికి రెండు రోజుల ముందు.. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మాట్లాడుతూ.. వివేక హత్యతో తమకు కానీ తమ కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధం లేదని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తూ సంచలనంగా మారారు.

అక్కడితో ఆగని లోకేష్.. నిజంగా జగన్ కానీ వివేక హత్యతో ఎలాంటి సంబంధం లేని పక్షంలో ఆయన కూడా తన మాదిరి శ్రీవారి ఎదుట ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. తిరుపతి పర్యటన సందర్భంగా వేంకటేశ్వరస్వామి ఎదుట ప్రమాదం చేసే దమ్ము ఉందా? అని సవాలు విసిరారు. ఎన్నికల ప్రచార సభలో ఈ మాట అన్నా.. దాని ప్రభావం విడిగా కూడా ఉంటుందన్నది తెలిసిందే.

లోకేష్ వ్యాఖ్యలతో.. సీఎం జగన్ ఎలా రియాక్టు అవుతారన్నసందేహం వెంటాడుతున్న వేళ.. ఆయన తన పర్యటనను కుదిస్తూ నిర్ణయం తీసుకోవటం షాకింగ్ గా మారింది. టీడీపీ వర్గాలకు ఇదో అస్త్రంగా మారింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాను సభకు రావటం లేదని చెప్పినా.. విమర్శలు చేసేవారు.. వేలెత్తి చూపే వారు మాత్రం జగన్ మాటల్ని నమ్మని పరిస్థితి.

దీంతో.. లోకేష్ విసిరిన సవాలుకు స్పందించలేకనే జగన్ ముఖం చాటేశారన్న ప్రచారం మొదలైంది. ఇది అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. తాజాగా టీడీపీ యువ ఎంపీగా రామ్మోహన్ నాయుడు లాంటి నేతలంతా కూడా జగన్ తిరుపతి టూర్ కు వెళ్లపోవటానికి కారణం యువనేత విసిరిన సవాలుతోనే అంటూ తేల్చేస్తున్నారు. ఇదంతా చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. ఏ తప్పు చేయని సీఎం జగన్మోహన్ రెడ్డి.. ప్రధానప్రతిపక్షం తెర మీదకు తీసుకొచ్చిన సవాల్ ను తీసుకొని దేవుని ఎదుట ప్రమాణం చేస్తే సరిపోతుంది. అదే జరిగితే తెలుగు తమ్ముళ్ల నోరు మూతపడిపోతుంది కదా? మరి.. ఆలస్యమెందుకు జగన్.. సవాలును పూర్తి చేసేస్తే సరిపోతుంది కదా?